పెళ్లి సాయంత్రం చేసుకుందామని చెప్పి.. | SC ST Atracity Case Filed On Four Members | Sakshi
Sakshi News home page

'ప్రే'ముంచాడు

Apr 5 2018 1:04 PM | Updated on Sep 15 2018 3:18 PM

SC ST Atracity Case Filed On Four Members - Sakshi

శ్రీకాకుళం రూరల్‌: యువతిని నమ్మించి మోసగించడమేగాక, ఆమె కుటుంబసభ్యులపై దాడికి పాల్ప డిన వ్యక్తితో పాటు, అతడి కుటుంబ సభ్యులకు 15 రోజుల రిమాండ్‌ విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాడలిలో నివసిస్తున్న పెద్దమ్మ రామాయమ్మను చూసేందుకు భామిని మండలం గణసర గ్రామానికి చెందిన ఎస్టీ యువతి రామలక్ష్మి తరుచూ వెళ్తుండేది. ఈ క్రమంలో హిరమండలం పాడలికి చెందిన యర్లంకి రామకృష్ణతో పరిచయం ఏర్పడింది. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటూనని యువకుడు నమ్మబలికాడు. ఈ దశలో కోరిక తీర్చాలని బతిమిలాడినా ససేమిరా అనేసరికి పారిపోయి పెళ్లిచేసుకుందామని ఒప్పించి వైజాగ్‌కు మకాం మార్చాడు. మార్చి 13న రామలక్ష్మి.. పెద్దమ్మ ఇంటికి వెళుతున్నానని చెప్పి రామకృష్ణతో వైజాగ్‌ వెళ్లిపోయింది. రైల్వేస్టేషన్‌కు సమీపంలోని లాడ్జిలో ఓ రూమ్‌ తీసుకుని బస చేశారు. పెళ్లి సాయంత్రం చేసుకుందామని మాయమాటలు చెప్పి కోరిక తీర్చాలని ఒత్తిడి చేయగా ఆమె ససేమిరా అనే సరికి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆ మాటలు నమ్మి మోసపోయింది.

రాత్రికి మళ్లీ ఇద్దరూ కొత్తూరు వెళ్లిపోయారు. మీ ఇంటికి వెళ్లిపోవాలని రామలక్ష్మికి చెప్పడంతో ఆమె ఒప్పుకోలేదు. ఇంటికి తీసుకెళ్లాలని పట్టుబట్టడంతో ఆమెను వారి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. జరిగిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయంపై గ్రామ పెద్దల వద్ద రామలక్ష్మి తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. మార్చి 19న పంచాయతీ పెట్టడంతో యువతిని పెళ్లి చేసుకుంటానని రామకృష్ణ ఒప్పుకున్నాడు. వారం రోజులు రామలక్ష్మి ఇంటి వద్దే ఉండిపోయాడు. తర్వాత తన తల్లిదండ్రులను గణసరకు తీసుకొచ్చాడు. ఈ వివాహానికి ఒప్పుకోలేమని వాళ్లు చెప్పి వెళ్లిపోయారు. హిరమండలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తన తల్లిదండ్రులు వస్తున్నారని, అక్కడ పెళ్లి చేసుకుంటామని నమ్మించి మార్చి 21న రామలక్ష్మి కుటుంబ సభ్యులను తీసుకెళ్లాడు. అక్కడ పెళ్లి ప్రస్తావన రావడంతో రామకృష్ణ కుటుంబసభ్యులంతా రామలక్ష్మి కుటుంబ సభ్యులపై మూకుమ్మడి దాడిచేసి పరారయ్యారు. రామలక్ష్మికి జరిగిన అన్యాయంపై బత్తిలి పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదుచేయగా.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ అండ్‌ రేప్‌ కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ డీఎస్సీ పెంటారావు కేసు దర్యాప్తు చేసి రామకృష్ణతో పాటు కుటుంబసభ్యులను న్యాయస్థానానికి తీసుకొచ్చారు. బుధవారం ఈ కేసు విచారించిన నాలుగవ అడిషినల్‌ జడ్జి వీరికి 15 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. నిందితులు యర్లంకి రామకృష్ణ, భాస్కరరావు, ప్రభావతితో పాటు వారి బంధువు ముంజేటి దర్మారావును అరెస్టుచేసి సబ్‌ జైల్‌కి తరలించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement