నౌబట్పూర్ ఉదంతం.. సిట్ దర్యాప్తునకు ఆదేశం
సాక్షి : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మరో రెండు తార్కాణాలు. బిహార్లో రెండు హేయనీయమైన ఉదంతాలు వెలుగు చూశాయి. ఒకదాంట్లో లైంగిక దాడికి గురైన బాధితురాలు అవమానభారంతో ఆత్మహత్య చేసుకోగా.. మరో కేసులో అత్యాచారయత్నం విఫలం కావటంతో దుండగులు ఓ మహిళను అతిదారుణంగా హింసించి హత్య చేశారు. రాజధాని పట్నాకు కాస్త దూరంలో ఉన్న నౌబట్పూర్ గ్రామంలో ఈ ‘నిర్భయ’ తరహా ఉదంతం వెలుగు చూసింది.
ధీరజ్ పాశ్వాన్ అనే 22 ఏళ్ల యువకుడు.. అదే గ్రామానికి చెందిన మహిళ(35)తో కొంత కాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆమెపై తన స్నేహితుడి సాయంతో ధీరజ్ దారుణానికి యత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించగా.. ఆపై అకృత్యానికి పాల్పడ్డాడు. ముందు కర్రతో కొట్టి.. ఆపై గాయపడిన ఆమె జననేంద్రియాల్లోకి ఇనుపరాడ్లను చొప్పించి హింసించాడు. ఆమె పరిస్థితి విషమించటంతో పట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు కాసేపటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మహిళా సంఘాలు ఉద్యమానికి సిద్ధం కాగా, కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందం(సిట్) ను ఏర్పాటు చేసినట్లు ఏడీజీ ఎస్ కే సింగల్ తెలిపారు.
ఇప్పటికే ప్రధాన నిందితుడు ధీరజ్ను అదుపులోకి తీసుకున్నామని.. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. కాగా, నలుగురు పిల్లల తల్లి అయిన ఆమె.. ఆ యువకుడితో గతంలో సన్నిహితంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
బాధితురాలి ఆత్మహత్య...
తనపై అత్యాచారం జరగ్గా.. ఆ అవమాన భారంతో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భగల్పూర్లో చోటు చేఏసుకుంది. మంగళవారం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయమై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ మరుసటి రోజే ఇంట్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించింది.