32 అత్యాచారాలు, నాలుగు హత్యలు | Sakshi
Sakshi News home page

32 అత్యాచారాలు, నాలుగు హత్యలు

Published Mon, Mar 4 2019 2:40 AM

Police chased the murder case of Sreedharani - Sakshi

ఏలూరు టౌన్‌: పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధారామాల పర్యాటక ప్రాంతంలో గతనెల 24న శ్రీధరణి (19)పై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పశ్చిమ పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్‌ వివరాలను వెల్లడించారు. గత నెల 24న బౌద్ధారామాల పర్యాటక ప్రాంతంలో ప్రేమికుల జంట ఏకాంతంగా ఉండగా కృష్ణా జిల్లా మైలవరం గ్రామానికి చెందిన పొట్లూరి అంకమరావు అలియాస్‌ రాజు (28), జి.కొత్తపల్లికి చెందిన తుపాకుల సోమయ్య (22), తుపాకుల గంగయ్య (20), మాణికం నాగరాజు (20) అక్కడికి వచ్చారు.

ముందుగా ప్రియుడు నవీన్‌పై దాడి చేసి స్పృహ కోల్పోయేలా కొట్టారు. అనంతరం యువతి శ్రీధరణిపై రాజు లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను హత్య చేశారు. ఆధారాలు లభించకుండా వారిద్దరి నుంచి ఫోన్లను లాక్కొని వాటిని ముక్కలు, ముక్కలు చేసి దారిలో అక్కడక్కడా విసిరివేశారు. వారి నుంచి లాక్కొన్న సొమ్ముతో నలుగురూ పార్టీ చేసుకున్నారు. నిందితులు మూడు జిల్లాల్లో 2017 నుంచి సుమారు 32 మంది యువతులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. గుంటూరు, కృష్ణా, పశ్చిమ, ఖమ్మం జిల్లాల్లో సుమారు 7 కేసులు నమోదయ్యాయని, వీటిలో నాలుగు హత్యలు ఉన్నాయని ఎస్పీ వివరించారు.

Advertisement
Advertisement