పాత స్కూటర్‌ ప్రకటనతో.. సైబర్‌ మోసం

Man Try To Buy Second Hand Scooter By Cyber Fraud Online - Sakshi

ముంబై: ఆన్‌లైన్‌ నకిలీ ప్రకటన మాయలో పడి ఓ వ్యక్తి నిలువు దోపిడికి గురయ్యాడు. పాత యాక్టివా స్కూటర్‌ రూ.25 వేలకు విక్రయించబడును అనే ప్రకటనతో సుమారు రూ.97 వేలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఖార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 3న ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ స్కూటర్‌ను రూ. 25 వేలకు అమ్మబడును అనే ప్రకటనను చూశాడు. కానీ ఆ ప్రకటన నకిలీదని గుర్తించలేక.. అందులో ఇచ్చిన మోబైల్‌ నంబర్‌కు ఫోన్‌ చేశాడు. ప్రకటన ఇచ్చిన సైబర్‌ నేరగాడు.. స్కూటర్‌ను కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని ముందస్తుగా కొంత డబ్బును అడ్వాన్స్‌ రూపంలో ఆన్‌లైన్‌ ఖాతాకి పంపాలని అతనితో చెప్పాడు. అనంతరం స్కూటర్‌ను బుక్‌ చేసుకోవాలన్నాడు. దీంతో అతను ముందస్తుగా రూ.15 వేలు నేరగాడికి ఖాతాకి పంపించాడు. మిగిలిన డబ్బును స్కూటర్‌ తీసుకున్నాక చెల్లిస్తానని చెప్పాడు. అయితే ఈ నెల 4న ఆ వ్యక్తికి మరో సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేసి.. ఆ వ్యక్తి బుక్‌ చేసుకున్న స్కూటర్‌ను తీసుకురావడానికి.. ట్రాన్స్‌పోర్టు ఛార్జీల కోసం మరో రూ.5 వేలు ఇవ్వాల్సిందిగా కోరడంతో వాటిని కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాడు. అంతటితో ఆగకుండా మరికొంత డబ్బు చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో మరో రూ. 7వేలు పంపాడు.

ప్రకటన ఇచ్చిన మొదటి మోసగాడు అసలు విక్రేతగా నటిస్తూ.. ఆ వ్యక్తి నుంచి తీసుకున్న డబ్బును తిరిగి అతనికి ఇవ్వాలని పథకం ప్రకారం రెండో మోసగాడిని డిమాండ్‌ చేశాడు. దీంతో రెండో మోసగాడు ఆ వ్యక్తికి డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి.. అతని ఈ-వ్యాలెట్‌కు రెండు లింక్స్‌ పంపాడు. దీంతో ఆ ఆన్‌లైన్‌ లింక్స్ ఉపయోగించడం తెలియని ఆ వ్యక్తి తనకు డబ్బులు తిరిగి వస్తాయని అనుకొని వాటిని క్లిక్‌ చేయడంతో అతని అకౌంట్‌ నుంచి మరో రూ. 70వేలు పోగొట్టుకున్నాడు. దీంతో తను సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ. 97 వేలు పోగొట్టుకున్నట్టు గ్రహించాడు.  నేరగాళ్లకు ఫోన్‌ చేస్తే ఇద్దరి మోబైల్స్ స్విచ్చాఫ్‌ వచ్చాయి.  దీనిపై అతను పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశాడు. నేరగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టమని ఖార్‌ పోలీసులు తెలిపారు.  

 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top