సిరిపల్లిలో వ్యక్తి దారుణహత్య

Man Murdered in Siripalli East Godavari - Sakshi

తూర్పుగోదావరి, అయినవిల్లి (పి.గన్నవరం): ఓ వ్యక్తిని అతి కిరాతకంగా దారుణ హత్య చేసిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున అయినవిల్లి మండలం సిరిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథం ప్రకారం సిరిపల్లికి చెందిన వెలిగట్ల వీరవెంకట సత్యనారాయణ (32) వడ్రంగి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి భార్య దుర్గా దేవి, కుమారుడు, తల్లి నాగరత్నం ఉన్నారు. తెల్లవారుజామున అతడిని కొందరు కత్తితో నరికి అతి కిరాతంగా హత్య చేశారు.

హత్య జరిగిన సమయంలో అతడు ఇంట్లో ఒక్కడే నిద్రిస్తున్నాడు. అతని భార్య కుమారుని తీసుకుని బంధువుల ఇంట జరిగే వివాహ వేడుకకు వెళ్లింది. తల్లికి సరిగా కళ్లు కన్పించవు. అతని హత్యకు వివాహేతర సంబంధమే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్న వీరవెంకట సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అమలాపురం రూరల్‌ సీఐ జి.సురేష్‌బాబు, డీఎస్పీ ఆర్‌.రమణ, అయినవిల్లి ఎస్సై పీవీఎస్‌ఎన్‌ సురేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సిరిపల్లి వీఆర్వో అంకన సత్య రాజేష్‌ ఫిర్యాదు మేరకు సీఐ సురేష్‌బాబు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీమ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top