కొత్త పెళ్లి కొడుకు కానరాని లోకాలకు

groom dead in road accident - Sakshi

గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి

ఈడుపుగల్లు–ఉప్పులూరు మార్గంలో ఘటన

ఈడుపుగల్లు(కంకిపాడు): పెళ్లయి మూడు నెలలు కూడా నిండలేదు...ఉద్యోగానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న ఆ కొత్త పెళ్లి కొడుకు కానరానిలోకాలకు వెళ్లాడు. గుర్తు తెలియని వాహన రూపంలో మృత్యువు కబళించింది. ఈ హృదయ విదారక ఘటన మండలంలోని ఈడుపుగల్లు–ఉప్పులూరు మార్గంలో శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆదివారం ఉదయం ఈడుపుగల్లు–ఉప్పులూరు మార్గంలో రైతు కె.రమేష్‌ పొలంలో బోరు వదిలేందుకు వెళ్లగా పంట బోదెలో మృతదేహాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం అందించారు. ఉప్పులూరు, ఈడుపుగల్లుకు చెందిన కొందరు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు మండలంలోని ఉప్పులూరు గ్రామానికి చెందిన లాం సతీష్‌కుమార్‌ (25)గా గుర్తించారు.

సమాచారం అందుకున్న కంకిపాడు ఎస్సై హనీష్, ఏఎస్సై రామకృష్ణ ప్రమాదస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సతీష్‌కుమార్‌ విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత ఏడాది నవంబరులోనే వివాహమైంది. శనివారం రాత్రి 10.30 గంటలు దాటాక విధులు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరిన సతీష్‌కుమార్‌ ఇంటికి చేరుకోలేదు. ఆఖరిగా ఫోన్‌లో మాట్లాడిన తరువాత, మరలా ఫోన్‌ కలవలేదని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈడుపుగల్లు డెయిరీ ఫామ్‌ దాటిన తరువాత ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో వాహనం అదుపుతప్పి సుమారు 20 మీటర్ల మేరకు బైక్‌ను ఈడ్చుకుపోయి పక్కన ఉన్న పంట బోదె మురుగులో ఇరుక్కుపోయాడు. తలకు హెల్మెట్‌ ఉన్నా శరీరంలో అంతర్గతంగా గాయాలు కావటంతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హనీష్‌ తెలిపారు.

కుటుంబానికి శోకం.......
సతీష్‌కుమార్‌ మృతితో ఆ కుటుంబంలో శోకం మిగిలింది. తల్లి బుజ్జి సతీష్‌కుమార్‌ను కష్టపడి పెంచింది.  తన వివాహానికి ప్రతి ఒక్కరినీ సతీష్‌ ఇంటింటికీ వెళ్లి ఆహ్వానించాడని, ఇంతలోనే ఘోరం జరగటం బాధాకరమంటూ ఘటనా స్థలానికి వచ్చిన పలువురు కన్నీటి పర్యంతం అయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top