కోర్టు ధిక్కార కేసులో నలుగురికి జైలు శిక్ష

Four were sentenced to jail for Contempt of court case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయలేదని దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యాల్లో నలుగురికి జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2 వేర్వేరు కేసుల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు సోమవారం ఈ మేరకు వెల్లడించారు. భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పునరావాసం, పునర్‌నిర్మాణం పరిహారం అందించాకే వారి భూములను స్వాధీనం చేసుకోవాలని, అప్పటివరకూ సాగు చేసుకునేందుకు అనుమతించాలని హైకోర్టు గత ఆదేశాల్ని ఉల్లంఘించారని దాఖలైన కోర్టు ధిక్కార కేసుల్లో ఈ తీర్పు వెలువడింది. సిద్దిపేట జిల్లా తోగుట గ్రామస్తులు, మరికొందరు వేర్వేరుగా దాఖలు చేసిన 2 వ్యాజ్యాలను విచారించింది.

కోర్టు ఆదే శాలను అమలు చేయకుండా తమ భూముల్లో పనులు చేశారని, పోలీసులతో వేధింపులకు గురిచేశారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న హైకోర్టు.. కాళేశ్వరం ప్రాజెక్టు రెండో డివిజన్‌ నీటిపారుదల శాఖ సూపరిం టెండెంట్‌ ఇంజనీర్‌ టి.వేణు, తోగుట ఎస్సై ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డిలకు 2 నెలల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. మరో కేసులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ 7వ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి.బద్రీనారాయణ, రాఘవా కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ బి.శ్రీనివాస్‌రెడ్డిలకు 3 నెలల జైలు శిక్ష, రూ.2,000 చొప్పున జరిమానా విధించింది.ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా ఈ ఉత్తర్వుల అమలును 6 వారాలపాటు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top