ఈడీ ఉచ్చులో మంత్రి, కుటుంబం | ED notice to Roshan Baig and his family members | Sakshi
Sakshi News home page

ఈడీ ఉచ్చులో మంత్రి, కుటుంబం

Jan 16 2018 9:12 PM | Updated on Sep 5 2018 1:40 PM

ED notice to Roshan Baig and his family members - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ నేత, మంత్రి రోషన్‌ బేగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. విదేశీ ద్రవ్య వినిమయ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై రోషన్‌ బేగ్, ఆయన కుమారుడు, కుమార్తెకు ఈడీ నోటీస్‌లు జారీ చేసింది. రోషన్‌ బేగ్‌ కుటుంబానికి చెందిన రుమన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీకి గత 8 సంవత్సరాల నుంచి అరబ్‌ దేశాల నుంచి కోట్లాది రూపాయలు డబ్బు బదిలీ అయింది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరాలు వెల్లడించకపోవడంతో ఈడీ అధికారులు రోషన్‌ బేగ్, ఆయన కుమారుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే రోషన్‌ బేగ్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ప్రతిపక్షాలకు ఇది ప్రచారాస్త్రంగా మారుతుంది.

ఏమిటీ వ్యవహారం
రుమాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ 2007లో ప్రారంభమైంది.ఈ కంపెనీని బేగ్‌ కుమార్తె సబీహా ఫాతిమా, కుమారుడు రుమన్‌ బేగ్‌ పర్యవేక్షిస్తున్నారు. కంపెనీకి 2008 మేలో సౌదీ అరేబియాలోని ఫెజూరియా స్టీల్‌ బ్యారల్స్‌ కంపెనీ నుంచి రూ.1.14 కోట్లు చొప్పున రెండుసార్లు కలిపి రూ.2.28 కోట్లు జమయ్యాయి. ఇందులోనే ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది.

సీఎంను కలిసిన రోషన్‌
ఈడీ నోటీస్‌ జారీ కావటంతో నగరాభివృద్ధి శాఖ మంత్రి రోషన్‌ బేగ్‌ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు కృష్ణలో సీఎం సిద్ధరామయ్యను కలిశారు. ఈడీ నోటీస్‌లు ఇచ్చినట్లు వివరణ ఇచ్చి పది నిమిషాల్లోనే వెళ్లిపోయినట్లు సమాచారం. కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement