కామాంధుడికి మరణశిక్ష . | Sakshi
Sakshi News home page

కామాంధుడికి మరణశిక్ష .

Published Sun, May 13 2018 3:40 AM

Death penalty to convict for rape and murder case - Sakshi

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లో నాలుగు నెలల చిన్నారిపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్యచేసిన కేసులో దోషిగా తేలిన నవీన్‌ గడ్కే(26)కు ఇండోర్‌ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసును విచారించిన అదనపు సెషన్స్‌ జడ్జి వర్షా శర్మ రికార్డుస్థాయిలో 23 రోజుల్లోనే నవీన్‌ను దోషిగా నిర్ధారిస్తూ శనివారం తీర్పు ఇచ్చారు. పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నవీన్‌ దోషిగా తేలినట్లు న్యాయమూర్తి శర్మ తీర్పులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శర్మ 51 పేజీల తీర్పును వెలువరిస్తూ.. ‘ఇలాంటి హేయమైన, క్రూరమైన చర్యలకు పాల్పడే వ్యక్తి సమాజానికి పట్టిన చీడ లాంటివాడు.

రోగి శరీరంలో కుళ్లిపోయిన భాగాలను ఆపరేషన్‌ ద్వారా డాక్టర్లు తొలగించినట్లే.. ఇలాంటి నేరస్తులను సమాజం నుంచి దూరంగా ఉంచాలి. ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం’ అని వ్యాఖ్యానించారు. ఏడ్వడం తప్ప మరొకటి తెలియని చిన్నారితో నేరస్తుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్‌లోని రజ్వాడా ప్రాంతంలో తల్లిదండ్రులతో నిద్రపోతున్న చిన్నారిని ఏప్రిల్‌ 20న కిడ్నాప్‌ చేసిన నవీన్‌.. ఓ వాణిజ్య భవనం బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత చిన్నారి ఏడుస్తుండటంతో ఆమె తలను నేలపై మోది కిరాతకంగా హత్యచేశాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement