దంపతులు దుర్మరణం

Couple Dies In Road Accident West Godavari - Sakshi

కొవ్వూరు: మండలంలోని సీతంపేట జంక్షన్‌ వద్ద ఒక మోటారు సైకిల్‌ని బుల్లెట్‌ ఢీకొట్టడంతో నిడదవోలుకు చెందిన భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం రాత్రి నిడదవోలుకు చెందిన కొండ మల్లికార్జునరావు (50), మాధవి (40) మోటారు సైకిల్‌పై  రాజమండ్రి బయలుదేరారు. సీతంపేట జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న బుల్లెట్‌పై వేగంగా వస్తున్న యువకులు ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలపాలైన మల్లికార్జునరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను రాజమండ్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. రూరల్‌ ఎస్సై పి.రవీంద్ర బాబు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలి పారు. బుల్లెట్‌ నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బుల్లెట్‌పై ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  

మృత్యువులోనూ వీడని బంధం
నిడదవోలు రూరల్‌: ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి కిరాణా వ్యాపారం చేసుకుంటూ ఉండే మల్లికార్జునరావు, మాధవిచంద్రిక  ప్రేమానుబం«ధాన్ని మృత్యువూ విడదీయలేకపోయింది.  పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలని.. వారికి పెళ్లిళ్లు చేసి పిల్లాపాపలతో ఆనందంగా ఉండాలనే వారి కోరిక నెరవేరకుండానే మిగిలిపోయింది. నిడదవోలు గణపతిసెంటర్‌లో కొండా మల్లికార్జునరావు, ఆయన  భార్య మాధవిచంద్రిక వరసిద్ధి వినాయక జనరల్‌ స్టోర్స్‌ నిర్వహిస్తున్నారు. నిడదవోలు గ్రామదేవత నంగాలమ్మ జాతరకు ఈనెలాఖారున వచ్చే బం«ధువులకు వస్త్రాలు కొనేందుకు వారిద్దరూ స్కూటీపై ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం బయలుదేరి వెళ్లారు. కొవ్వూరు మండలం సీతంపేట వద్ద ప్రమాదం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకొడుకు అఖిల్‌ పూణేలో, చిన్నకొడుకు ముకుందహర్ష చెన్నైలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండగా, కుమార్తె ప్రత్యూష భీమవరంలో ఇంజినీరింగ్‌ చదువుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top