బాలికను చిదిమేసిన కాలేజీ బస్సు

College bus killed the girl  - Sakshi

హైదరాబాద్‌: అదుపుతప్పిన ఓ కళాశాల బస్సు బాలికను చిదిమేసింది. శుభకార్యానికి వెళ్తున్న బాలిక కాలేజీ బస్సు కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లింది. బుధవారం హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేటకు చెందిన బొడ్డుపల్లి బాలకిషన్‌ కూతురు మధుశాలిని (12) చైతన్యపురిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది.

అబ్దుల్లాపూర్‌మెట్‌లోని తమ బంధువుల ఇంట్లో జరిగే ఓ శుభకార్యానికి వెళ్లే క్రమంలో తన బాబాయ్‌ వెంకటేశ్‌తో కలసి బైకుపై వెళ్తుండగా.. పెద్దఅంబర్‌పేట గ్రామం నుంచి ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతుండగా నగరం వైపు నుంచి వస్తున్న సెయింట్‌మేరీస్‌ కాలేజీకి చెందిన బస్సు ఢీ కొట్టింది. దానిని తప్పించే క్రమంలో కాలేజీ బస్సు వెంకటేశ్‌ బైకును వెనుకనుంచి ఢీ కొట్టింది. దీంతో బైకు వెనుకసీటులో కూర్చున్న మధుశాలిని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో వెంకటేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top