ఆటోలే టార్గెట్‌

Auto Robbery Gang Arrest in Hyderabad - Sakshi

ఆటోలు చోరీ చేసేముఠా అరెస్ట్‌

రూ. 26 లక్షల విలువ చేసే

వాహనాలు స్వాధీనం   

గోల్కొండ:  చోరీ చేసిన ఆటోలను విక్రయిస్తున్న ఓ ముఠాను గోల్కొండ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ మండల డీసిపి ఎ.ఆర్‌. శ్రీనివాస్‌ శుక్రవారం గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌లో ఈ వివరాలు వెల్లడించారు. గత నెల 31న అర్షద్‌ అనే ఆటో డ్రైవర్‌ షేక్‌పేట్‌ లక్ష్మణ్‌ నగర్‌లో ఓ ఇంటి ముందు తాను పార్క్‌ చేసి ఆటో దొంగతనానికి గురైందని గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా తీగ లాగితే డొంక కదిలినట్లు కేసు విచారణ చేపట్టిన పోలీసులకు దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు తేలింది. ఈ నెల 17న సాయంత్రం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు పారామౌంట్‌ గేటు నెం. 4 వద్దఉన్నఖాళీ ప్రదేశంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా వీరు మొత్తం 13 ఆటోలను ఈ ముఠా దొంగిలించినట్లు తేలింది. వీరిలో టోలిచౌకి హకీంపేట్‌కు చెందిన షేక్‌ సలీం (28), లంగర్‌హౌజ్‌కు చెందిన మహ్మద్‌ నయీం (20) స్నేహితులు.

వీరిద్దరు ఆటో డ్రైవర్లు. వచ్చే సంపాదన సరిపోవడం లేదని వీరిద్దరు ఆటో దొంగతనాలకు స్కెచ్‌ వేశారు.గోల్కొండకు చెందిన మహ్మద్‌ ఖలీం, హకీంపేట్‌కు చెందిన మహ్మద్‌ ఉమర్, గోల్కొండకు చెందిన మహ్మద్‌ షెహబాజ్, హకీంపేట్‌కు చెందిన మహ్మద్‌ ఆసిఫ్‌లను కలిసిపార్క్‌చేసి ఆటోలను దొంగిలించి తమ కిస్తే ఒక్కో ఆటోకు రూ. 20 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంట్లో భాగంగా ఈ నలుగురు మొత్తం 13 ఆటోలను షేక్‌ సలీం, మహ్మద్‌ నయీంలకు ఇచ్చారు. ఈ విధంగా దొంగిలించిన ఆటోలను వారు నాందేడ్‌ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్‌ మోబిన్‌ షేక్‌ మహ్మద్‌తో కలిసి ఆ ఆటోలను నాందేడ్,ఆదిలాబాద్‌ జిల్లాలలో ఒక్కొక్కటికి రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు అమ్మేవారు. ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న ఆటోలను రాత్రిపూట మాత్రమే ఈ ముఠా దొంగిలించేది. ఈ విధంగా వచ్చిన డబ్బుతో వీరు జల్సాలకు పాల్పడేవారు. ఈ ముఠా సభ్యులపై నగరంతో పాటు సైబరాబాద్‌ కమిషనరేట్‌లలో 16 కేసులు ఉన్నాయి.  దొంగిలించిన ఆటోలను అమ్మడంలో సిద్ధస్తుడైన మోబిన్‌ కొన్ని ఆటోలను రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు విక్రయించాడు. వీరి నుంచి రూ. 26 లక్షల విలువ గల 13 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్‌మీట్‌లో గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ తెజావత్‌ కొమురయ్య, డిఐ, ఎస్సై తదితరులు పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top