తాడ్వి ఆత్మహత్య కేసు; ముగ్గురికి బెయిల్‌

Accused in Payal Tadvi Suicide Case Get Bail - Sakshi

ముంబై: జూనియర్‌ డాక్టర్‌ పాయల్‌ తాడ్వి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితురాళ్లు హేమ అహుజ, భక్తి మెహరే, అంకిత ఖండేల్‌వాల్‌లకు బాంబే హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 2 లక్షల రూపాయల బాండు సమర్పించాలని, రోజు విడిచి రోజు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం షరతులు విధించింది. వీరిని బీవైఎల్‌ చారిటబుల్‌ నాయర్‌ ఆస్పత్రి లోపలికి అనుమతించరాదని ఆదేశించింది. బెయిల్‌ ఇచ్చేందుకు స్పెషల్‌ కోర్టు నిరాకరించడంతో నిందితురాళ్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

బీవైఎల్‌ చారిటబుల్‌ నాయర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల పాయల్‌ తాడ్వి ఈ ఏడాది మే 22న హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పాయల్‌ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మహారాష్ట్రలోని తాడ్వి భిల్‌ ముస్లిం తెగ(ఎస్టీ)కు చెందిన ఆదివాసీ యువతి అయిన పాయల్ సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పాయల్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ను జూలై 6న ఫోరెన్సిక్‌ అధికారులు కనుగొన్నారు. ఈ కేసులో 1200 పేజీల చార్జిషీటును కోర్టుకు ముంబై పోలీసులు గత నెల కోర్టుకు సమర్పించారు. (చదవండి: ఈ పాపం ఎవరిది?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top