రుపీ పతనంతో రెమిటెన్స్‌లు జూమ్ | Rupee, bonds off lows; foreign investors in focus | Sakshi
Sakshi News home page

రుపీ పతనంతో రెమిటెన్స్‌లు జూమ్

Dec 18 2014 1:34 AM | Updated on Jul 6 2019 12:42 PM

రుపీ పతనంతో రెమిటెన్స్‌లు జూమ్ - Sakshi

రుపీ పతనంతో రెమిటెన్స్‌లు జూమ్

దేశీ కరెన్సీ రోజురోజుకీ బలహీనపడుతున్న నేపథ్యంలో ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు) దేశంలోకి పంపుతున్న విదేశీ నిధులు(రెమిటెన్స్) పుంజుకుంటున్నాయి.

ముంబై: దేశీ కరెన్సీ రోజురోజుకీ బలహీనపడుతున్న నేపథ్యంలో ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు) దేశంలోకి పంపుతున్న విదేశీ నిధులు(రెమిటెన్స్) పుంజుకుంటున్నాయి. ఈ ఏడాది నవంబర్ నుంచీ డాలరుతో మారకంలో రూపాయి పతనమవుతూ వస్తున్న కారణంగా సంపన్న వర్గాల(హెచ్‌ఎన్‌ఐలు) నుంచి ఇండియాకు రెమిటెన్స్‌లు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ చెల్లింపుల సర్వీసుల సంస్థ యూఏఈ ఎక్స్ఛేంజ్ సమాచారం ప్రకారం గత వారం గరిష్ట స్థాయి రెమిటెన్స్‌ల పరిమాణం 70% పుంజుకుంది.

ఇక వ్యాపార పరిమాణం 20% ఎగసినట్లు యూఏఈ ఎక్స్ఛేంజ్ ట్రెజరీ వైస్‌ప్రెసిడెంట్ అశ్విన్ శెట్టి చెప్పారు. ఎన్‌ఆర్‌ఐలు కనిష్టంగా రూ. 25 లక్షల నుంచి గరిష్టంగా రూ. 5 కోట్ల వరకూ రెమిటెన్స్‌లను జమ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ మనీ వైస్‌ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ సుధేష్ గిరియన్ సైతం ఇదే విధమైన వివరాలు వెల్లడించారు.

అధిక విలువగల రెమిటెన్స్‌లు ఇటీవల 15-20% మధ్య పుంజుకున్నట్లు తెలిపారు. గరిష్ట స్థాయిలో ఆదాయం పొందే వ్యక్తులు రూపాయి బలహీనతను సొమ్ము చేసుకునేందుకు వీలుగా అధిక మొత్తాల్లో డాలర్లను జమ చేస్తున్నట్లు వివరించారు. కాగా, డాలరుతో మారకంలో రూపాయి నవంబర్ 3న 61.40గా నమోదుకాగా, తాజాగా 13 నెలల కనిష్టమైన 63.61కు చేరింది. ఇది 4% పతనం.
 
గతేడాది 70 బిలియన్ డాలర్లు
నిజానికి గతేడాది కూడా రెమిటెన్స్‌లు భారీ స్థాయిలో ఎగశాయి. మొత్తం 70 బిలియన్ డాలర్లమేర నిధులు దేశానికి తరలివచ్చాయి. ఈ బాటలో చైనాకు 60 బిలియన్ డాలర్లు, ఫిలిప్పీన్స్‌కు 25 బిలియన్ డాలర్లు చొప్పున రెమిటెన్స్‌లు వెల్లువెత్తాయి. కాగా, ప్రపంచబ్యాంక్ వివరాల ప్రకారం 2012లో కూడా 69 బిలియన్ డాలర్లమేర రెమిటెన్స్‌లు భారత్‌కు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement