
‘జీఎస్టీ’ పర్యవేక్షణకు 201 మంది అధికారులు
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలును జిల్లాల స్థాయిల్లో పర్యవేక్షించే బాధ్యతను కేంద్రం 201 మంది సీనియర్ అధికారులకు అప్పగించింది.
కేంద్ర ప్రభుత్వ ఉమ్మడి కార్యదర్శులకు అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలును జిల్లాల స్థాయిల్లో పర్యవేక్షించే బాధ్యతను కేంద్రం 201 మంది సీనియర్ అధికారులకు అప్పగించింది. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వీరు అధిక ప్రాధాన్యమిస్తారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా జిల్లాలను 166 సమూహాలుగా విభజించి, వాటిని కేంద్ర రెవెన్యూ శాఖ పరిపాలన విభాగాలతో అనుసంధానించినట్లు మంగళవారం కేంద్రం ఒక ప్రకటన జారీచేసింది. ఈ సమూహాలకు ఉమ్మడి కార్యదర్శి, లేదా ఆ పైస్థాయి అధికారులను కేటాయించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న నిత్యావసర వస్తువులు, ధరల్లో మార్పులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.
ధరల్లో పెరుగుదల ఉంటే వెంటనే ఆ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాలు, రెవెన్యూ విభాగం దృష్టికి తీసుకొస్తారు. ఇప్పటికే పలు కేంద్ర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఈ అధికారులు.. తమకు కేటాయించిన జిల్లాల్లో జీఎస్టీ అమలు, వ్యాపారుల నమోదు, దుకాణాల్లో పన్ను రేట్ల ప్రదర్శన, అవగాహన కార్యక్రమాలు, జీఎస్టీఎన్ పనితీ రు, బిల్లింగ్ తదితరాలను పర్యవేక్షిస్తారు. విని యోగదారుల సంఘాలు, వ్యక్తులు, వ్యాపార సం స్థలు, జిల్లా పాలనాయంత్రాంగం నుంచి జీఎస్టీ అమలుపై అభిప్రాయ సేకరణ చేపడతారు.
దివ్యాంగుల ఉపకరణాలపై జీఎస్టీ 5 శాతమే
దివ్యాంగుల ఉపకరణాలపై జీఎస్టీ 5 శాతమే అని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. దివ్యాంగులపై కనికరం చూపని విధంగా కేంద్రం జీఎస్టీ రేట్లను ఖరారు చేసిందన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. బ్రెయిలీ రైటర్స్, బ్రెయిలీ పేపర్, వీల్ చెయిర్, టాకింగ్ బుక్స్, వినికిడి పరికరాలు తదితరాలపై 5 శాతం జీఎస్టీనే విధిస్తామని కేంద్రం తెలిపింది.