టాప్‌ 100 గ్లోబల్‌ థింకర్స్‌లో అంబానీకి చోటు

Mukesh Ambani Placed In Top Global Thinkers List By Foreign Policy - Sakshi

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించి చరిత్ర సృష్టించిన భారతీయ కుబేరుడు ముఖేష్‌ అంబానీ ఈ ఏడాది టాప్‌ 100 గ్లోబల్‌ థింకర్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ఫారిన్‌ పాలసీ గ్లోబల్‌ మ్యాగజీన్‌  ప్రతిష్టాత్మకంగా ప్రచురించే ఈ జాబితాలో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా, అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌, ఐఎంఎఫ్‌ హెడ్‌ క్రిస్టీన్‌ లాగ్రడేలకు కూడా చోటు దక్కింది. ప్రస్తుతం టాప్‌ 100 గ్లోబల్‌ థింకర్స్‌లో కొంతమంది పేర్లను మాత్రమే ప్రచురించిన ఫారిన్‌ పాలసీ జనవరి 22 నాటికి పూర్తి జాబితాను వెల్లడించనుంది.

‘44. 3 బిలియన్‌ డాలర్ల సంపదతో ముఖేష్‌ అంబానీ.. జాక్‌ మాను వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఆయిల్‌, గ్యాస్‌, రిటైయిల్‌ రంగాల్లో తనదైన ముద్రవేసిన అంబానీ.. జియోతో భారత టెలికాం రంగంలో సంచనాలు నమోదు చేశారు. జియోను ప్రారంభించిన ఆరు నెలల్లోపే వంద మిలియన్‌ కస్టమర్లను ఆకర్షించి స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్‌నెట్‌ విప్లవానికి తెరతీశారు. ఇకపై డిజిటల్‌ ఎయిర్‌వేవ్స్‌ ద్వారా లైఫ్‌స్టైల్‌ ప్రాడక్ట్‌ను అమ్మి గూగుల్‌, ఫేస్‌బుక్‌లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు’ అని ఫారిన్‌ పాలసీ వెల్లడించింది.

అంతేకాకుండా 2019తో గ్లోబల్‌ థింకర్స్‌ జాబితా ప్రచురణ పదేళ్ల వసంతంలోకి అడుగుపెడుతోందని ఫారిన్‌ పాలసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా వివిధ రంగాల్లో ప్రభావం చూపుతూ, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల జాబితా ప్రకటిస్తున్నామని తెలిపింది. వంద మంది గ్లోబల్‌ థింకర్స్‌లో మొత్తం 10 కేటగిరీలు ఉంటాయని, ముఖేష్‌ అంబానీ టాప్‌ 10 టెక్నాలజీ థింకర్స్‌లో చోటు దక్కించుకున్నారని వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top