
సాక్షి, న్యూఢిల్లీ: ఆకర్షణీయ ఫీచర్లు, అద్బుతమైన స్మార్ట్ఫోన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షావోమి మరోసారి తన సత్తాను చాటింది. తాజా హై ఎండ్ వెర్షన్ డివైస్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడు పోయింది. బెజెల్-లెస్ డిస్ప్లేతో విడుదలైన షావోమి ఎంఐ మిక్స్ 2 ఫోన్ విక్రయానికి ఉంచిన కేవలం మూడు నిమిషాల్లోపే పూర్తి అమ్మకాలను సాధించింది. దీంతో తదుపరి సేల్ అక్టోబర్ 24ను చేపట్టనున్నట్టు షావోమి తెలిపింది.
మూడు నిమిషాలలోపే ఎంఐ మిక్స్ 2 అన్ని యూనిట్లను విక్రయించినట్టు షావోమి ఎండీ మను కుమార్ జైన్ ప్రకటించారు. ఇంకా లక్షమందికి పైగా వినియోగదారులు ఈ స్మార్ట్ఫోన్పై ఆసక్తిని కనబర్చినట్టు తెలిపారు.
రూ.35,999కు ఎంఐ మిక్స్2 స్మార్ట్ఫోన్ గత వారం భారత్లో విడుదలైంది. ఫ్లిప్కార్ట్, ఎంఐ.కాం ద్వారా తొలిసారిగా ఈ స్మార్ట్ఫోన్ను నేడు (అక్టోబర్ 17) విక్రయానికి ఉంచింది. కాగా గతంలో కూడా షావోమి స్మార్ట్ఫోన్లు నిమిషాల వ్యవధిలోనే రికార్డు అమ్మకాలను సాధించిన సంగతి తెలిసిందే.
ఎంఐ మిక్స్2 ఫీచర్లు
5.99 అంగుళాల డిస్ప్లే
2.4 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్
6జీబీ/8జీబీ ర్యామ్
64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్
3400 ఎంఏహెచ్ బ్యాటరీ