బెంజ్ సర్కిల్లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. యలమంచిలి అరెస్టు
సాక్షి, విజయవాడ : విజయవాడ బెంజ్ సర్కిల్లోఅర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. జై ఆంధ్ర ఉద్యమనేత కాకాని వెంకటరత్నం విగ్రహం తొలిగేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ చర్యను వైఎస్సార్ సీపీ నేత యలమంచిలి రవి అడ్డుకున్నారు. విగ్రహ కమిటీకి చెప్పకుండా కాకాని విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని రవి ప్రశ్నించారు. ప్రొక్లైనర్ను అడుకుని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. దీంతో యలమంచిలి రవిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి మాచవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని అధికారులు అక్కడి నుంచి తొలగించారు.
వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో యలమంచిలి రవిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారని విమర్శించారు. విగ్రహం తొలగింపుపై ఎవరికీ సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాక అడ్డుకున్న తమను పోలీసుల బలవంతంగా అరెస్టు చేశారని తెలిపారు. వైఎస్సార్ సీపీ నేతలు వంగవీటి రాధా, ఎల్లంపల్లి శ్రీనివాస్లు యలమంచిలి రవిని కలిసి పరామర్శించారు. మరోవైపు బెంజ్ సర్కిల్ ఉద్రిక్తత కొనసాగుతోంది. కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.