
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు జిల్లాలలోని పార్టీ కార్యాలయాల్లోనూ వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం చేయడంతో పాటుగా, పళ్లు, మందులు, దుస్తులను పంపిణీ చేశారు.
విజయవాడ పార్టీ కార్యాలయంలోనూ జననేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పార్థసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్ భారీ కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని.....రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కేక్ కటింగ్ అనంతరం దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఫ్రీ మెడికల్ క్యాంప్కు సైతం ఎత్తున స్థానిక ప్రజలు హాజరై వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకున్నారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వమే మన రాజకీయ ఆస్తి అని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి భారీ కేక్ కట్చేసి జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. జగన్ వ్యక్తిత్వంపై అకారణంగా మోసపూరిత కుట్రలు చేసినా, ఏ తప్పు చేయని వ్యక్తిని ఏడాదిన్నర పాటు జైలుకు పంపించినా, సడలని సంకల్పంతో తండ్రి ఆశయ సాధన కోసం, ప్రజలకు భద్రత కల్పించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. వైఎస్ జగన్ చేసిన ఉద్యమాలు ఏ నాయకుడు చేయలేదన్నారు. ఏ సినీ గ్లామర్ లేకపోయినా, కుట్రలు కుతంత్రాలు చేసినా ఇంతగా వైఎస్ఆర్సీపీని ముందుకు నడిపిస్తున్న యోధుడు వైఎస్ జగన్ అన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతున్న వైఎస్ జగన్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు కడతారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా... నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు సూళ్లూరుపేటలోనూ జరిగాయి. ఆయనకు అంతా మంచే జరగాలని, ప్రజాసంకల్పయాత్ర మరింత దిగ్విజయంగా కొనసాగాలని పార్టీ నేతలు కోరుకున్నారు. శ్రీచెంగాల పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధించి వైఎస్ జగన్ సీఎం కావాలని అమ్మవారిని కోరుకున్నామని ఎమ్మెల్యే సంజీవయ్య తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు వైఎస్ జగన్కు ఉంటాయన్నారు. అలాగే వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో వైఎస్ఆర్ సీపీ యువ నేతలు పూజలు చేశారు. శ్రీవారి సన్నిధిలో కొబ్బరికాయాలు కొట్టారు. ప్రజల సంక్షేమం కోసం పోరాడే వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నారు.
అతిచిన్న వయస్సులో యువతకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్న ఏకైక నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ పుట్టిన రోజున వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో దుష్టశక్తులు అడ్డుపడుతున్నా.. అకుంటిత దీక్షతో ప్రజలతో మమేకమై, ప్రజల్లో ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. ఆయన నిండు నూరేళ్లు దేవుడి ఆశీర్వాదంతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా వైఎస్ఆర్ సీపీతో కలిసి రావాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జగన్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.