చంద్రబాబుపై ఏం కేసు పెట్టాలి...?
శ్రీకాకుళం : రుణమాఫీపై మరో నెల రోజులు వేచి చూస్తామని, లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు రుణాలు రీ షెడ్యూలు చేయటం సాధారణంగా జరిగే విషయమేనని... అయితే తానే రీ షెడ్యూల్ చేయిస్తున్నట్లు చంద్రబాబు గొప్పలు చెపుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.
ప్రకృతి వైపరీత్యాలు, కరవు కాటకాల సమయంలో రుణాలు రీషెడ్యూల్ చేయడమనేది రిజర్వు బ్యాంకు ఎప్పుడూ చేసేదేనన్నారు. అధికారంలోకి రాగానే అన్ని వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ చెప్పిన చంద్రబాబు ఇప్పటివరకూ మాఫీపై స్పష్టత ఇవ్వటం లేదన్నారు. డ్వాక్రా రుణాలు తీర్చాలంటూ బ్యాంకర్లు మహిళలను ఒత్తిడి చేస్తున్నారని అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. పోలీసులు... జేబుదొంగపై 420 కేసు పెడతారని, మరి ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడుపై ఏం కేసు పెట్టాలని వైఎస్ జగన్ ప్రశ్నించారు.