రైల్వేస్టేషన్‌లో వాషబుల్‌ యాప్రాన్లు

Washable Yaprance In Railway station - Sakshi

సాక్షి, విశాఖపట్నం: స్వచ్ఛతలో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్టేషన్‌గా ఖ్యాతి గడించిన విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ పరిశుభ్రత చర్యలపై మరింత దృష్టి సారిస్తోంది. ప్రయాణికులకు దుర్గంధం వెదజల్లకుండా ఆధునిక విధానాలను చేపడుతోంది. ఇందులోభాగంగా ప్లాట్‌ఫారాల మధ్య ఉండే రైలు పట్టాల కింద వాషబుల్‌ యాప్రాన్లను ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా 2016లో ఆరో నంబరు ప్లాట్‌ఫారం ట్రాక్‌పై ఈ యాప్రాన్‌కు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత దశల వారిగా మిగిలిన ఏడు ప్లాట్‌ఫారాల ట్రాక్‌లపైన వీటిని అమర్చింది.

గతంలో సిమెంట్‌ స్లీపర్ల (దిమ్మెలు)కు పట్టాలు అమర్చి ఉండేవి. దీంతో రైల్వే స్టేషన్లలో రైలు బోగీల్లో ఉన్న ప్రయాణికులు చేసిన మలమూత్ర విసర్జనలు వాటిపై పడి ప్లాట్‌ఫారాలపై వేచివుండే వారికి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లేది. వీటిని నీటితో పంప్‌ చేసినా పూర్తిగా తొలగిపోయేది కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే వాషబుల్‌ యాప్రాన్ల ఏర్పాటు ఆలోచన చేసింది. ఇందుకు విశాఖ రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేసింది. ఈ యాప్రాన్లకు ఇపాక్సీ కోటింగ్‌ వేయడం వల్ల వ్యర్థ విసర్జాలు వాటికి అంటుకోకుండా జారిపోతాయి. దీంతో నీటి పైపులతో తేలిగ్గా తొలగించడంతో పాటు డ్రెయిన్లలోకి పంపే వీలుంటోంది. దీనివల్ల ప్లాట్‌ఫారాల మ«ధ్య పట్టాలు నిత్యం పరిశుభ్రతతో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్టేషన్లో ఉన్న ఎనిమిది ప్లాట్‌ఫారాలకు వాషబుల్‌ యాప్రాన్ల ఏర్పాటు పూర్తయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top