నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దక్షిణాఫ్రికా దేశస్తులు గాయపడ్డారు.
నాయుడుపేట (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు) : నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దక్షిణాఫ్రికా దేశస్తులు గాయపడ్డారు. దక్షిణాఫ్రికాకు చెందిన అడ్వెంచర్స్ చారిటీస్ అనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు కొందరు మన దేశంలో పర్యటిస్తున్నారు. మేఘాలయ నుంచి ప్రారంభమైన వారి పర్యటన కోచి వరకు సాగనుంది.
ఈ క్రమంలో వారు ఆటోల్లో కోచి వైపు వెళ్తుండగా నాయుడుపేట సమీపంలోని ఇనుమాముల గ్రామం వద్ద జాతీయరహదారిపై వీరి ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని వైద్యుల సూచన మేరకు చెన్నైకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాయుడుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.