నీటిగుంతలో పడి ఇద్దరు మృతి
బనగానపల్లి (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం పలకూరు గ్రామ శివారులోని మైనింగ్ నీటి గుంతలో పడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఆదివారం ఉదయం మృతదేహాలు నీటిపై తేలాయి. శనివారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తూ నీటిగుంతలో పడి వీరు మృతిచెంది ఉంటారని బావిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన తిరుపతి(35), శీను(35) మైనింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు గతరాత్రి వినాయక నిమజ్జనంలో పాల్గొన్నారు.
అయితే రాత్రి నుంచి వీరు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. ఆదివారం ఉదయం వీరిద్దరి మృతదేహాలు నీటి గుంతలో తేలాయి. తిరుపతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శీనుకు భార్య, కుమారుడు ఉన్నారు. వీరు వలస కూలీలుగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇద్దరూ మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.