
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఆన్లైన్లో ఔషధ విక్రయాలను నిరసిస్తూ శుక్రవారం మెడికల్ షాపుల బంద్ చేపడతామని పెందుర్తి– గోపాలపట్నం–సింహాచలం–కంచరపాలెం జోన్ అధ్యక్షుడు కొల్లూరు నానాజీ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన మెడికల్ షాపుల యజమానులతో పోస్టర్, కరపత్రాల ప్రచారాలు చేపట్టారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో చట్ట వ్యతిరేక మందులు విక్రయించే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు.
ప్రభుత్వాలు ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉపాధిని గండికొట్టేలా, ప్రజల ఆరోగ్య భద్రతకు భంగం కలిగేలా మితిమీరిన చర్యలు చేపడితే ఎలా ఉపేక్షిస్తామని ప్రశ్నిం చారు. ఆలిండియా కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం మెడికల్ షాపుల బంద్ చేపడతామని వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ షాపులు తెరుచుకోవని తెలిపారు. తమ జోన్ పరిధిలో గోపాలపట్నంలో గాయత్రి మెడికల్, ఎస్సార్ మెడికల్ షాపులను అత్యవర సేవలకు కేటాయించామని చెప్పారు. అత్యవసర సేవలకు 9246674158, 9866768693నంబర్లలో ప్రజలు సంప్రదించవచ్చన్నారు.