
గోకవరం (జగ్గంపేట): గ్రామ శివారున కొత్తపల్లి వెళ్లే మార్గంలో శనివారం మధ్యాహ్నం చెట్టును స్కూటర్ ఢీకొట్టిన సంఘటనలో గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెదురుపాకకు చెందిన నాగవరపు పూజిత(17), మద్దాల సురేఖ, గోకవరంనకు చెందిన తుమ్మగంటి భాగ్యలక్ష్మి ఇంటర్మీడియట్ సీఈసీ గ్రూపు రెండో సంవత్సరం చదువుతున్నారు. శనివారం మధ్యాహ్నం భోజన సమయంలో బయటకు వచ్చిన వీరికి కళాశాల గేటు వద్ద గంగంపాలెంకు చెందిన తోటి విద్యార్థి కర్రి నాగేంద్రబాబు యాక్టివా స్కూటర్పై కనిపిం చాడు. దీంతో తమలో ఒకరు భోజనం తెచ్చుకోలేదని టిఫిన్ తెచ్చుకుంటామని నాగేంద్రబాబు స్కూటర్ తీసుకుని ముగ్గురు విద్యార్థినులు కొత్తపల్లి వైపు వెళ్లారు.
ఈ క్రమంలో గ్రామ శివారున ఉన్న మలుపులో స్కూటర్ అదుపుతప్పి చెట్టును వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్కూటర్ వెనుక వైపు కూర్చున్న నాగవరపు పూజిత అక్కడికక్కడే మృతి చెందగా, స్కూటర్ నడుపుతున్న భాగ్యలక్ష్మి తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మధ్యలో కూర్చున్న సురేఖ రెండు చేతులు, నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆ మార్గంలో వస్తున్న స్థానిక మీడియా వ్యక్తులు స్థానికులు సహాయంతో క్షతగాత్రులను ఆటోలో గోకవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఇద్దరు విద్యార్థినులను ఆటోలో తరలిస్తుండగా సమాచారం అందుకున్న కోరుకొండ 108 వాహనంలో మార్గమధ్యంలో గుమ్మళ్లదొడ్డి వద్ద క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో భాగ్యలక్ష్మి తలకు తీవ్రగాయమై పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియవచ్చింది.
విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై టి.వెంకటసురేష్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని సంఘటన గూర్చి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జెడ్పీటీసీ సభ్యుడు పాలూరి బోసుబాబు ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతురాలి తల్లి, ఇతర బంధువులు ఆస్పత్రి వద్ద రోదించిన తీరు కలచివేసింది. మృతురాలి తండ్రి సుమారు నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందగా ఇప్పుడు కుమార్తె కూడా ఇదే విధంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదించిన తీరు వర్ణనాతీతం. గోకవరం ఎస్సై వెంకటసురేష్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. విద్యార్థులు, అధ్యాపకులు గోకవరం ప్రభుత్వాసుపత్రికి తరలివచ్చి విలపించారు.
మృత్యువుతో పోరాడుతున్న లంక దుర్గారావు
రాజానగరం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న సంపత్నగరానికి చెందిన లంక దుర్గారావు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రిలో మృత్యువుతో పొరాడుతున్నాడు. తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, 24 గంటలు గడిస్తేనేగాని చెప్పలేమని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతనిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని అతని బంధువు, సంపత్నగరం ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకులు లంక అమ్మిరాజు తెలిపారు. కాగా లంక దుర్గారావు సంపాదనతోనే అతని కుటుంబం ఆధారపడి ఉంది. తండ్రి లేడు, ఐదేళ్ల క్రితం అతని తల్లి ప్రమాదానికి గురికావడంతో మంచానపట్టింది. ఆమెకు ఉన్న ముగ్గురు సంతానంలో లంక దుర్గారావు రెండోవాడు. మొదటివాడు తింగరివాడు కావడం, మూడో వాడు వయస్సులో చిన్నవాడు కావడంతో కుటుంబ భారాన్ని ఇతనే మోయవలసి వస్తుంది. దీనితో కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న అతనికి ఏవిధమైన ప్రాణాపాయం లేకుండా కాపాడాలంటూ గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన అతని మిత్రుడు పెంటగట్ల దుర్గారావు కుటుంబంలో మూడో వాడు. వీరు నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు. కూలి పనులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ తరుణంలో పెంటగట్ల దుర్గారావు మృతితో ఆ కుటుంబం శోక సంద్రమైంది.