జగన్కు సమస్యలు వివరిస్తున్న విద్యార్థిని భార్గవి
పత్తికొండ రూరల్ : ‘సార్.. మాలాంటి పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు.. ఇలాగైతే ఉన్నత చదువులెలా చదవాలి’.. అంటూ కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని వి.భార్గవి వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం కొలుములపల్లె నుంచి ముద్దవరం చేరుకుంటున్న జగన్ను ఆమె కలిసి ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యతో పాటు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. సీసీ రోడ్లులేక స్థానికులు ఇబ్బందిపడుతున్నారని, రికమండేషన్లు ఉంటేనే పింఛన్లు, పక్కా గృహాలు, రేషన్కార్డులు ఇస్తున్నారని జగన్ దృష్టికి తెచ్చింది.
ఇటీవల తన తండ్రిపై టీడీపీ నాయకులు దాడి చేశారని, తన కుటుంబానికి సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. కక్షపూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకులపై న్యాయ పోరాటం చేయాలని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు జగన్ సూచించారు. విద్యార్థుల సమస్యలతో పాటు గ్రామ సమస్యలనూ విన్నవించిన భార్గవిని అభినందిస్తూ.. ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుందని ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు పక్కాగా అమలుచేస్తామని హామీ ఇచ్చారు.


