రైతులు, కూలీల హక్కులను కాలరాసే భూ సేకరణ చట్టం 2013 సవరణను ప్రతిఘటిస్తూ గురువారం సీపీఐ రాష్ట్ర కమిటీ...
ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు
కలెక్టరేట్ వద్ద గేట్లు దూకేందుకు యత్నం
అడ్డుకున్న పోలీసులు....పలువురి అరెస్టు
సాక్షి, కడప : రైతులు, కూలీల హక్కులను కాలరాసే భూ సేకరణ చట్టం 2013 సవరణను ప్రతిఘటిస్తూ గురువారం సీపీఐ రాష్ట్ర కమిటీ జైల్భరో కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భూసేకరణ చట్టం పేరుతో భూములను లాక్కునేందుకు ప్రభుత్వాలు కొత్త నాటకానికి తెర తీశాయని వారు దుమ్మెత్తి పోశారు.
కడప కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన
కలెక్టరేట్ వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగివచ్చి చట్టంలో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యకర్తలంతా కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ దశలో పోలీసులు అడ్డుకుని కొంతమంది సీపీఐ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వన్టౌన్ పోలీసుస్టేషన్కు తరలించారు.
జమ్మలమడుగు, రాజంపేట ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన
భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా రాజంపేట, జమ్మలమడుగు ఆర్టీఓ కార్యాలయాల వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సుమారు గంటకు పైగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు సుబ్బారెడ్డి, లక్ష్మయ్య, రామయ్యలతోపాటు రాజంపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద సీపీఐ నేత మహేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు.