
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో వాయిదా పడిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు ఈ నెల 19వ తేదీన జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 18 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఏపీలో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అధికార వైఎస్సార్సీపీకి నాలుగు స్థానాల్లో నెగ్గే బలం ఉన్నప్పటికీ, అసెంబ్లీలో కేవలం 23 ఎమ్మెల్యే సీట్లే ఉన్న టీడీపీ వర్ల రామయ్యను పోటీకి దింపింది.
వైఎస్సార్సీపీ తరఫున ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణా రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని నామినేషన్లు దాఖలు చేశారు. 5వ అభ్యర్థి పోటీలో ఉండటంతో ఈ నెల 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. వాస్తవానికి మార్చి 25న జరగాల్సిన ఎన్నికలు కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల మేరకు కొత్త తేదీని ప్రకటించింది.