రుణాలందని గిరిజనం | Not give on compensation for crop damage | Sakshi
Sakshi News home page

రుణాలందని గిరిజనం

Nov 15 2013 6:08 AM | Updated on Jun 4 2019 5:04 PM

వివిధ పథకాల కింద ప్రభుత్వం గిరిజనులకు అందిస్తున్న సబ్సిడీ రుణాలు అందని ద్రాక్షలా మారాయి.

ఇందూరు,న్యూస్‌లైన్: వివిధ పథకాల కింద ప్రభుత్వం గిరిజనులకు అందిస్తున్న సబ్సిడీ రుణాలు అందని ద్రాక్షలా మారాయి. ఎంతో ఆశతో దరఖాస్తులు చేసుకున్న నిరుద్యోగులు, రైతులు సమయానికి రుణాలు అందక పోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కోసం కిరాణా, జనరల్ స్టోర్, ఇతర వ్యాపారాలు పెట్టుకునేందుకు, రైతులకు బోరు, పంపు సెట్లు, విద్యుత్ కనెక్షన్ ఇతర వాటికి బ్యాంకు సబ్సిడీ రుణాలు అందించాల్సి ఉంది. అయితే 2013-14 సంవత్సరానికి సంబంధించి ఒక్క రుణం కూడా గిరిజనులకు అందించకుండా ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతోంది. 2012-13 ఆర్థిక సంవత్సరం ముగిసిన  (మార్చి) తరువాత రెండు నెలల్లోగా కొత్త ఆర్థిక సంవత్సర రుణాల యాక్షన్ ప్లాన్ ఖరారు చేసి ప్రభుత్వం జిల్లాలకు పంపించాలి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా యాక్షన్ ప్లాన్ ను విడుదల చేయలేదు. జరుగుతున్న జాప్యం పై జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులను అడిగితే.. గిరిజనులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీని అందించే విషయం ఆలోచిస్తుందని, అందుకే ఆలస్యం అవుతోందని సమాధానం ఇస్తున్నారు.
 
 ఇటు జిల్లాలో ఒక పక్క రుణాల కోసం బ్యాంకు అనుమతి తీసుకున్న గిరిజనులు గిరిజన సంక్షేమ శాఖలో దరఖాస్తులు చేసుకుం టునే ఉన్నారు. బ్యాంకు అనుమతి ఇచ్చిన బ్యాంకు మేనేజర్లు కూడా  ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్తున్నారని, మళ్లీ అనుమతి కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. దరఖాస్తు దారుల తాకిడిని తట్టుకోలేక అధికారులు విసుగు చెందుతున్నారు. ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ విడుదల చేసినప్పుడు ఇస్తాం పోండి అంటూ  మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా మూడు నెలలుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 400 మందికి పైగా సబ్సిడీ బ్యాంకు రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఖరీఫ్‌లో వరి, ఇతర పంటలను పండించుకునేందుకు బోరు, మోటారు,విద్యుత్ కనెక్షన్‌లు కావాలని చాలా మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఏం లాభం ఖరీఫ్ సీజ న్ కాస్త ముగిసిపోయింది. ఇటు వ్యాపారాలు పెట్టుకుందామని ఆశతో ఉన్న నిరుద్యోగులకు సరైన సమయానికి రుణాలు అందక నిరాశ చెందుతున్నారు.
 ఈ నెలాఖరులోగా రావచ్చు....
 
 రాములు,జిల్లా గిరిజన సంక్షేమాధికారి
 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేయలే దు. గిరిజనులకు 50 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు అందించాలని ఆలోచన చేస్తోంది. అం దుకే ఆలస్యం జరుగుతోంది. అయినప్పటికీ దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ విడుదల చేసే అవకాశం ఉంది. రాగానే అర్హూలందరికీ రుణాలు అందజేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement