బాలుడ్ని ఎత్తుకెళ్లిన కోతులు
కాళ్లపై కరవడంతో అల్లాడిపోయిన పిల్లాడు
స్థానికులు అడ్డగించడంతో అటవీ ప్రాంతంలో వదిలేసిన కోతులు
తాడేపల్లి రూరల్: పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో రోజురోజుకూ కోతిమూకల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆదివారం ఇదే ప్రాంతానిక చెందిన రవి, దేవి దంపతుల రెండేళ్ల బాలుడు నరసింహ వరండాలో ఆడుకుంటుండగా గుమ్మంలోకి కోతుల గుంపు వచ్చింది. వాటిని దేవీ తరిమేందుకు ప్రయత్నం చేయగా నరసింహం రెండు చేతులు కాళ్లు పట్టుకొని మూడుకోతులు అమాంతంగా లాక్కుని అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశాయి. ఇంటి నుంచి 300 మీటర్లు బాలుడ్ని తీసుకెళ్లాయి. తల్లి తన కొడుకును కోతులు ఎత్తుకుపోయాయని బిగ్గరగా అరిసింది. దాంతో అటవీ భూముల్లో బహిర్భూమికి వెళ్లిన వారు కేకలు విని కోతులను అడ్డగించారు. అయినప్పటికీ ఆ కోతులు బాలుడ్ని వదలకుండా గట్టిగా పట్టుకున్నాయి. ఇదే సమయంలో కోతుల గుంపు వచ్చింది. అక్కడే ఉన్న పశువుల కాపరులు తరిమికొట్టడంతో బాలుడ్ని వదిలేసి వెళ్లాయి. బాలుడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.