
ఎయిర్పోర్టా? బస్టాండా?
గన్నవరం విమానాశ్రయం కూనలమ్మపాలెం బస్టాండ్లా ఉందని బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు.
- గన్నవరం విమానాశ్రయంపై వెంకయ్యనాయుడు ఎద్దేవా
- మచిలీపట్నం పోర్టు ఏమైందని నిలదీత
- మోడీకి మద్దతు ఇవ్వాలని విన్నపం
- విజయవాడలో ప్రచారం ప్రారంభం
సాక్షి, విజయవాడ : గన్నవరం విమానాశ్రయం కూనలమ్మపాలెం బస్టాండ్లా ఉందని బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ‘ప్రధానిగా నరేంద్రమోడీ’ ప్రచార కార్యక్రమం ప్రారంభం సందర్భంగా పీడబ్ల్యుడీ గ్రౌండ్లో జరిగిన భారీ సభలో ఆయన మాట్లాడారు. విజయవాడ లాంటి ప్రముఖ నగరానికి ఉండాల్సిన ఎయిర్పోర్టు ఇదేనా అని ప్రశ్నించారు. ఎయిర్పోర్టు ధనికులకు అనుకుంటారు కానీ అలా కాదనీ... పరిశ్రమలవాళ్లు, వ్యాపారులు ఎక్కువ రావడానికి, వారు పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మచిలీపట్నం పోర్టు ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇన్నాళ్లు పాలకులు ఏంచేశారని నిలదీశారు.
బీజేపీ మత రాజకీయాలను ప్రోత్సహించదు...
బీజేపీ మత రాజకీయాలను ప్రోత్సహించదని వెంకయ్యనాయుడు అన్నారు. మతం వ్యక్తిగతమైనదన్నారు. మతం అన్నది పూజా పద్ధతి.. మనం చెప్పే హిందుత్వమన్నది జీవన పద్ధతి అని వివరించారు. బీజేపీ అంతా ఒక నాయకుడి చుట్టే తిరుగుతుందని రాహుల్ అంటున్నాడనీ... తమకు నాయకులకు కొరత లేదని చెప్పారు. వాజ్పేయి, అద్వానీ మొదలు సుష్మాస్వరాజ్, అరుణ్జైట్లీ, రాజ్నాథ్సింగ్ ఇలా ఎందరో ఉన్నారన్నారు. గాంధీ కుటుంబం 65 ఏళ్లలో 45 ఏళ్లు దేశాన్ని పాలించిందన్నారు. అక్కడ ఎవరి చుట్టూ రాజకీయం తిరుగుతుందో రాహుల్ చెప్పాలన్నారు. దేశం ఈ పదేళ్లలో ఎంతో నాశనమైందని ఆయన చెప్పారు.
ప్రజలు మార్పు రావాలని కోరుకుంటున్నారన్నారు. సినీనటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ తాను తిరిగి పార్టీలోకి వచ్చాక హాజరైన మొదటి బహిరంగసభ అని అన్నారు. మోడీ ప్రధాని కావాలని దేశం కోరుకుంటోందన్నారు. ఈ సందర్భంగా గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పలువురు వెంకయ్యనాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సమావేశంలో వెంకయ్యనాయుడు కుమార్తె దీప పాల్గొన్నారు. రెండు రోజులుగా విజయవాడ నగరంలో ఉన్న వెంకయ్యనాయుడు పలువురు ప్రముఖులను కలుసుకొన్నారు. కొందరినీ పార్టీలోకి ఆహ్వానించారు.