వైద్యో నారాయణో హరి అంటారు. అటువంటి వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, కనీస భద్రతలు పాటించకుండా ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్లైన్ : వైద్యో నారాయణో హరి అంటారు. అటువంటి వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, కనీస భద్రతలు పాటించకుండా ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆస్పత్రి భవనాల్లో అగ్నిమాపక పరికరాలు పెట్టక పోవడం తో రోగుల ప్రాణాలకు రక్షణ కరువైంది. జిల్లాలోని చాలా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు నిలువరించడానికి కనీస పరికరాలు లేవు. జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలో సుమారు 300లకు పైగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో వేలాది మంది రోగులు రోజు చికిత్స పొందుతుంటారు.
వీరి నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్న యాజమాన్యాలు బహుళ అంతస్తుల్లో కనీస భద్రత చర్యలు పాటించడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల భవనాలు నిర్మించేటప్పుడు అగ్నిమాపక శాఖ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) తీసుకోవాలి. ఇప్పటివరకు ఏ ఒక్కరూ అసలు దరఖాస్తు కూడా ఇవ్వలేదని స్వయంగా జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పడం శోచనీయం. కాగా, వైద్య ఆరోగ్య శాఖ అనుమతి కూడా తీసుకుని నిర్మించాల్సి ఉండగా అటువంటి వేమి పట్టించుకున్న దాఖలాలు లేవు.
42 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు
జిల్లాలో అగ్నిమాపకశాఖ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 42 ప్రైవేట్ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు అగ్నిమాపక శాఖ అధికారులు అందజేశారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించి అనుమతులు లేని ఆస్పత్రులకు నోటీసులు అందజేశారు. త్వరలో లోకయుక్తలో కేసులు వేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో చాలా సార్లు సదరు ప్రైవేట్ ఆస్పత్రులకు అగ్నిమాపక శాఖ అధికారులు నోటీసులు ఇచ్చినా ఆస్పత్రుల యజమాన్యాలు స్పందించ లేదు. దీంతో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కేసులు వేస్తాం..
- సందన్న, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి
జిల్లాలో అగ్నిమాపక శాఖ అనుమతులు లేని ప్రైవేట్ ఆస్పత్రులపై కేసులు వేస్తాం. ఇప్పటికే 42 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏ ఒక్కటి కూడా నో అబ్జక్షన్ సర్టిఫికేట్ అనుమతి పొందలేదు. ప్రతి ఒక్క ఆస్పత్రికి అనుమతులు అవసరం.