నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వం అక్రమ బదిలీలకు తెర తీసింది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కోరిన వారికి కోరుకున్న
జిల్లాలో 36 మంది ఉపాధ్యాయుల బదిలీ!
Feb 4 2014 12:52 AM | Updated on Aug 24 2018 2:33 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్లైన్: నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వం అక్రమ బదిలీలకు తెర తీసింది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కోరిన వారికి కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పించేందుకు మంత్రుల ఒత్తిడితో సీఎం పేషీ రంగం సిద్ధం చేసింది. ఈక్రమంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది ఉపాధ్యాయులను గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేస్తూ సీఎం పేషీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిసింది. ఇందులో జిల్లాలో 36 మంది ఉపాధ్యాయులుండగా, దీనిపై పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. బదిలీ అయిన వారిలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషా పండిత ఉపాధ్యాయులన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ బదిలీలను ప్రభుత్వం ఏటా వేసవి సెలవుల్లో కౌన్సెలింగ్ విధానం ద్వారా నిర్వహిస్తోంది.
ఒకే స్థానంలో రెండేళ్ల సర్వీసు కలిగిన వారికి అవకాశమిస్తూ, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి తప్పనిసరి బదిలీ విధానాన్ని అమలు పరుస్తుండగా మధ్యలో ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో అక్రమ బదిలీలు నిర్వహిస్తూ అర్హులైన వారికి మొండి చెయ్యి చూపుతోంది. ఎన్నికల్లో ఓట్లు దండుకోవచ్చని మంత్రులు ఉపాధ్యాయుల బదిలీకి సిఫార్సు చేస్తుండగా, సీఎం పేషీలోని అధికారులకు ఒక్కో బదిలీకి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకూ ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. జీవోల ద్వారా అయితే బహిరంగమవుతుందనే ఉద్ధేశంతో ప్రభుత్వం అక్కమ బదిలీలకు మొమోల రూపంలో ఉత్తర్వులు జారీ చేస్తుండగా, ప్రభుత్వం ఇచ్చిన మెమోలను డీఈవో అమలు పరుస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అక్రమ బదిలీలను రద్దు పర్చాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల జి. ప్రభుదాసు, ఎం.హనుమంతరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement