సరిహద్దుల్లోనే వైద్యపరీక్షలు చేయాలి

Coronavirus: Medical tests should be done within the boundaries says Highcourt - Sakshi

రాష్ట్రంలోకి వచ్చేవారిని అవసరమైతే క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో తమ సొంత స్థలాలకు వెళ్లేందుకు వచ్చిన వారికి సరిహద్దుల్లోనే వైద్య పరీక్షలు చేయాలని రాష్ట్ర హైకోర్టు సూచించింది. వారు బయట తిరిగేందుకు వీలులేదని తేలితే అటువంటి వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. మిగిలిన వారి నుంచి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటామన్న లిఖితపూర్వక హామీని తీసుకోవాలని సూచించింది. వారిపై నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించింది. పిల్లలున్న మహిళలు, గర్భిణుల విషయంలో అధికారులు మానవతా దక్పథంతో వ్యవహరించాలని సూచించింది.

కరోనా వైరస్‌ నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు రాష్ట్రంలోకి ఎవరినీ రానివ్వడం లేదంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. వైద్యులు, నర్సులు తదితరులకు ఎన్‌–95 మాస్కులు అందజేసేలా ఆదేశాలివ్వాలంటూ మరో పిల్‌ దాఖలైంది. అదేవిధంగా రాష్ట్రంలో పలు విషయాల్లో నెలకొన్న పరిస్థితులను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించింది. వీటన్నింటిపై వేర్వేరుగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీచేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top