రైతు కష్టాలపై ఐదు అస్త్రాలు

CM Jagan announces minimum support price for six crops for the first time - Sakshi

రైతాంగం కోసం దేశంలో తొలిసారిగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి 

మొదటిసారిగా ఆరు పంటలకు కనీన మద్దతు ధర ప్రకటించిన సీఎం జగన్‌  

గ్రామ స్థాయికి 1,051 కొనుగోలు కేంద్రాలు 

విపత్తు వేళ రూ.2,624 కోట్లతో 7.83 లక్షల టన్నుల పంటల సేకరణ  

టీడీపీ హయాంలో కొన్నది అంతా కలిపి 3,47,916 టన్నులే 

సాక్షి, అమరావతి: ప్రస్తుత ప్రభుత్వం వాగ్దానాలకే పరిమితం కాకుండా చెప్పిన మాట నెరవేరుస్తూ రైతులకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ రంగంలోకి దిగి ఆదుకుంది. కరోనా విపత్తు సమయంలో కూడా కూరగాయల రైతులకు ఆసరాగా నిలిచింది. లాక్‌డౌన్‌తో రవాణా సౌకర్యం లేక కళ్లెదుటే కూరగాయలు కుళ్లిపోతుంటే మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది మారుమూల గ్రామాల్లోని రైతుల నుంచి పంటలు కొనుగోలు చేశారు. రైతు బజార్ల ద్వారా విపత్తులోనూ తక్కువ ధరలకు విక్రయించి ప్రభుత్వం అందరి మన్ననలు పొందింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేసి కందులు, శనగ, మొక్కజొన్న, జొన్న, పసుపు పంటలను కొనుగోలు చేసింది. పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, చీనికాయలు, చిరుధాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మద్దతు ధర ప్రకటించింది.  

రైతుల విజ్ఞప్తితో అదనంగా కొనుగోళ్లు
► రాష్ట్ర ప్రభుత్వం పసుపు పంటకు క్వింటాకు రూ.6,850 మద్దతు ధరగా ప్రకటించింది. మొదట్లో గరిష్టంగా ఒక్కో రైతు నుంచి 24 క్వింటాళ్లనే కొనుగోలు చేయాలనే నిబంధన పాటించినా, రైతుల విజ్ఞప్తి మేరకు గరిష్టంగా 40 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసింది. వైఎస్సార్‌ జిల్లాలో అక్రమాలకు పాల్పడిన కొనుగోలు కేంద్రాల ఏజెన్సీలను రద్దు చేసింది.  
► కర్నూలులో 22 వేల టన్నుల ఉల్లి పంటను కిలో రూ.8తో, చీని పంటను టన్ను రూ.14 వేల చొప్పున కొనుగోలు చేసింది. చిత్తూరు జిల్లాలో రైతుల నుంచి 5 వేల క్వింటాళ్ల టమాటాను కొనుగోలు చేసింది.

రైతు కష్టానికి విలువిచ్చే ప్రభుత్వం ఇది.. 
మద్దతు ధర కంటే తక్కువకు ఏ రైతూ అమ్ముకునే పరిస్థితి ఇక ఉండకూడదు. దళారీకి బలి కాకూడదు. రైతు కష్టానికి విలువనిచ్చే ప్రభుత్వంగా దేశ చరిత్రలో మొదటిసారి రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేసి పలు పంటలకు మద్దతు ధర అందించాం. «ధాన్యం, శనగ ఇంకా ఇతర పంటలన్నింటికీ కనీస మద్దతు ధరకు భరోసా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, చీనికాయలు, చిరుధాన్యాలకు మద్దతు ధర ప్రకటించాం. 
– దాదాపు 8 నెలల క్రితం రైతులకు సీఎం జగన్‌ భరోసా 

ఎకరాకు రూ.64 వేల లాభం  
వ్యాపారులు సిండికేటుగా మారి క్వింటాల్‌ రూ.4 వేలకే కొన్నా గత టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఫిబ్రవరిలో పసుపు పంటకు క్వింటాల్‌కు రూ.6,850 మద్దతు ధర ప్రకటించింది. నాకు ఎకరాకు 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం 24 క్వింటాళ్లను కొనడంతో రూ.1.64 లక్షలు వచ్చింది. ఖర్చులు రూ.1.50 లక్షలు పోను రూ.14 వేలు మిగిలాయి. మరో 11 క్వింటాళ్లను ప్రైవేట్‌గా అమ్ముకుంటే రూ.50 వేలు వచ్చాయి. మొత్తంగా ఎకరాకు రూ.64 వేల లాభం వచ్చింది.   
– రైతు ఉయ్యూరు సాంబిరెడ్డి, కొల్లిపర, గుంటూరు జిల్లా 

రైతుకు అండగా నిలిచాం  
రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పంటల సేకరణ ద్వారా రైతుకు అండగా నిలిచాం. గ్రామ స్థాయికి కొనుగోలు కేంద్రాలను తీసుకెళ్లాం. కరోనా నుంచి కాపాడేందుకు రైతులకు ముందుగానే టోకెన్లు ఇచ్చి పంటలను సేకరించాం. విపత్తు సమయంలో కూరగాయలు, పండ్ల రైతులను ఆదుకున్నాం. టమాటాను ప్రాసెసింగ్‌ ప్లాంట్లకు తరలించి ప్రయోగాత్మకంగా సాస్‌ తయారు చేశాం. ఇతర కూరగాయలకు కూడా అవసరమైతే ఈ విధానాన్ని అనుసరిస్తాం. ‘సీఎం యాప్‌’తో గ్రామ స్థాయిలో పంటల దిగుబడి, ధరల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాం. 
– ఎస్‌.ప్రద్యుమ్న, మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌ 

సర్కారు పక్కా వ్యూహం.. రైతులకు లాభం 
► కరోనా విపత్తు నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం మార్కెట్లను వికేంద్రీకరించి, గ్రామ స్థాయికి 1,051 కొనుగోలు కేంద్రాలను తరలించింది. మార్క్‌ఫెడ్‌ ఏర్పాటైన తర్వాత ఇంత వరకు ఎప్పుడూ లేని విధంగా 7.83 లక్షల టన్నుల పంటలను కొనుగోలు చేసింది. టీడీపీ ఐదేళ్ల హయాంలో 3,47,916 టన్నుల పంటలను మాత్రమే సేకరించడం గమనార్హం.  
► గత సర్కారు హయాంలో రైతులు గిట్టుబాటు ధరల కోసం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించిన సందర్భాలు కోకొల్లలు. కోత ఖర్చులు కూడా దక్కక పోవడంతో ఎన్నోసార్లు పంట ఉత్పత్తులను రోడ్లపైనే పారబోసి నిరసన తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.   
► ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో అలాంటి ఘటన ఏడాదిలో ఒక్కటి కూడా చోటు చేసుకోకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని రుజువు చేస్తోంది. పంటల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా వ్యూహాన్ని అను సరించింది. మార్కెటింగ్‌ సిబ్బందికి రోజువారీ లక్ష్యా లను విధించడంతో పండగలు, ఆదివారాల్లోనూ కొనుగోలు చేశారు. సకాలంలో చెల్లింపులు చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top