బైక్‌ల చోరీ ముఠా అరెస్ట్ | Bike theft gang arrested | Sakshi
Sakshi News home page

బైక్‌ల చోరీ ముఠా అరెస్ట్

Sep 7 2013 1:00 AM | Updated on Aug 21 2018 5:44 PM

అంతర్ జిల్లాల బైక్‌ల దొంగతోపాటు వాటిని విక్రయించటానికి సహకరిస్తున్న మరో ముగ్గురిని తడికలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు.

 తడికలపూడి(కామవరపుకోట), న్యూస్‌లైన్ : అంతర్ జిల్లాల బైక్‌ల దొంగతోపాటు వాటిని విక్రయించటానికి సహకరిస్తున్న మరో ముగ్గురిని తడికలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ. 30 లక్షల విలువైన 62 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ ఎం.రమేష్ తడికలపూడి పోలీస్ స్టేషన్లో విలేకరులకు చెప్పారు. ఏలూరు తూర్పు లాకులకు చెందిన పువ్వుల ఆదినారాయణ విజయవాడలో 25, రాజమండ్రిలో 13, పశ్చిమ గోదావరి జిల్లాలో 11, ఖమ్మం జిల్లాలో ఒక బైక్‌ను దొంగిలించాడు. ఇతను ప్రధానంగా షాపులు,  మార్కెట్ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన బైక్‌లను దొంగిలించేవాడు. ఆ బైక్‌లను అతను ఏలూరులో బైక్ మెకానిక్‌లు షేక్ మహ్మద్ అలీ, అదే నగరం పోణంగికి చెందిన బంకురు అప్పారావు, సత్యనారాయణపురానికి చెందిన నగరపు నరేష్‌కు అప్పగించేవాడు. వారు బైక్ ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చి విక్రయించేవారు. వచ్చిన డబ్బును జూదం, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగులు, పేకాట, మద్యం వంటి దుర్వసనాలకు ఖర్చు చేసేవారు.
 
 బైక్‌లు అమ్మేందుకు వచ్చి పట్టుబడ్డారు
 దొంగిలించిన బైక్‌లు అమ్మేందుకు మండలంలోని కళ్ళచెరువు గ్రామం వచ్చిన పువ్వుల ఆదినారాయణ, బంకురు వెంకటేశ్వరరావును పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు నగరపు నరేష్, షేక్ మహ్మద్ అలీని ఏలూరులో అరెస్ట్ చేశారు.
 
 సిబ్బందికి అభినందనలు
 నిందితులను పట్టుకోవటంలో చింతలపూడి సీఐ ఎం.వెంకటేశ్వరరావు కృషిని ఎస్పీ అభినందించారు. పెద్ద సంఖ్యలో బైక్‌ల రికవరీకి తోడ్పడిన ఎస్సె సీహెచ్ రామారావు, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, కానిస్టేబుళ్ళు ప్రసాద్, రవి, రాజు, దుర్గారావులను కూడా ఆయన అభినందించారు. జంగారెడ్డిగూడెం డిఎస్పీ సి.రాఘవ సమావేశంలో పాల్గొన్నారు.
 
 జిల్లాలో దొంగతనాలు పెరిగాయ్
 జిల్లాలో దొంగతనాలు పెరిగాయని ఎస్పీ ఎం.రమే ష్ పేర్కొన్నారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తడికలపూడి పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించిన ఆయన ’న్యూస్ లైన్’తో మాట్లాడారు. జిల్లాలో క్రైమ్ రేటులో మా ర్పు లేదని, గత ఏడాది మాదిరిగానే  ఉందన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు తదితరాలకు సంబంధించిన కేసులు  తగ్గాయని తెలిపారు.  
 
 బైక్ చోరీల్లో ఇది పెద్ద కేసు
 బైక్‌ల చోరీకి సంబంధించి జిల్లాలో పట్టుకున్న పెద్ద కేసు ఇదే అని ఎస్పీ రమేష్ చెప్పారు. దొంగిలించిన బైక్‌లలో స్ల్పెండర్ ప్లస్‌లు 46 ఉన్నాయన్నారు. స్వాధీనం చేసుకున్న మ్తొతం బైక్‌లలో 25 మాత్రమే ఎఫ్‌ఐఆర్ చూపించామని చెప్పారు. మిగిలిన బళ్లకు ఇంజన్ నంబర్లు, ఛాసిస్ నంబర్లు సరిపోలడంలేదన్నారు. బైక్‌ల చోరీలకు సంబంధించి జిల్లాలో చాలా కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. ఈ బైక్‌లను ఏలూరు పోలీస్ హెడ్ క్వార్టర్సులో ప్రదర్శనకు ఉంచుతామని, బళ్ళు పోగొట్టుకున్నవారు ఏలూరు వచ్చి సరైన ఆధారాలు చూపించి తీసుకెళ్ళవచ్చని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement