ఆక్సిజన్‌ యూనిట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌.. పసికందు మృత్యువాత

Baby Boy dead with Short circuit in the oxygen unit - Sakshi

హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో విషాదం

హిందూపురం: ఆక్సిజన్‌ యూనిట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించటంతో పుట్టిన కొన్ని గంటల్లోనే పసికందు మృత్యువాత పడిన దుర్ఘటన అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. వివరాలివీ.. హిందూపురం పట్టణ సమీపంలోని కొట్నూరుకు చెందిన సుహేల్‌ భార్య మదీన బేగంకు పురిటినొప్పులు రాగా, శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్యులు పరీక్షించి సాధారణ ప్రసవం అవుతుందన్నారు. తర్వాత కొద్దిసేపటికి అత్యవసరంగా సిజేరియన్‌ చేయాల్సి వస్తుందని చెప్పి ఆపరేషన్‌ చేశారు. మగబిడ్డ పుట్టాడు. కొంత సమయం తర్వాత బిడ్డ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడంటూ కృత్రిమంగా ఆక్సిజన్‌ ఇవ్వాలని చిన్నపిల్లల వార్డుకు తరలించారు. ఆక్సిజన్‌ ఇస్తున్న సమయంలో సంబంధిత యూనిట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. దీంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో పసిబిడ్డ మృతి చెందింది.

బిడ్డ చనిపోవడంతో బాధితులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సూపరింటెండెంట్‌ కేశవులు మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని, బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగా లేని కారణంతోనే మృతి చెందినట్లు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top