శ్రీకాంత్కు ఏపీ సర్కార్ భారీ నజరానా
సాక్షి, అమరావతి : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ కైవసం చేసుకున్న అతడికి ఏపీ సర్కార్ రూ.2 కోట్ల నగదుతో పాటు వెయ్యి గజాల స్థలం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే కోచ్ గోపిచంద్తో పాటు మరో ఇద్దరు కోచ్లకు రూ.30 లక్షలు అందచేయాలని తీర్మానించింది. ఈ మేరకు ఏపీ మంత్రివర్గం బుధవారం ఆమోద ముద్ర వేసింది. కాగా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ కెంటా నిషిమోటోపై 21-14, 21-13 తేడాతో కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
కేబినెట్ లో 35 అంశాలపై చర్చ
మరోవైపు ఏపీ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన కాబినెట్ భేటీలో దాదాపు 35 అంశాలపై చర్చ జరిగింది. స్వచ్ఛంద కార్పొరేషన్ రూ.500కోట్ల రుణం పొందేందుకు, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కోల్డ్ చైన్ కార్పొరేషన్ ఏర్పాటు, యూనివర్శిటీలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను ఏపీపీఎస్సీకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.