అవన్నీ పంట భూములే | ap capital lands | Sakshi
Sakshi News home page

అవన్నీ పంట భూములే

Nov 10 2015 9:05 AM | Updated on Aug 18 2018 5:57 PM

రాజధాని నగరాన్ని నిర్మిస్తున్న ప్రాంతంలో భూములన్నీ పంట భూములేనని మరోసారి స్పష్టమైంది.

 రాజధాని భూములు లెక్క తేల్చిన సీఆర్‌డీఏ
 పర్యావరణ అనుమతి దరఖాస్తుల్లో వెల్లడి


సాక్షి, విజయవాడ: రాజధాని నగరాన్ని నిర్మిస్తున్న ప్రాంతంలో భూములన్నీ పంట భూములేనని మరోసారి స్పష్టమైంది. 217.23 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎక్కువ భాగంలో పంటలు పండుతున్నాయని సీఆర్‌డీఏ తేల్చి చెప్పింది. దాదాపు 70 శాతం పంట భూములేనని పేర్కొంది. గతంలోనే ఈ లెక్కలు సేకరించినా అధికారికంగా వాటిని ఎప్పుడూ బయట పెట్టలేదు. మూడు పంటలు పండే ప్రాంతంలో రాజధాని కట్టడం సరికాదని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, హక్కుల సంఘాలు ఆందోళనలు చేసినా నోరు మెదపకపోగా ఆ వివరాలు వెల్లడించడానికే ఇష్టపడలేదు.

కానీ పర్యావరణ అనుమతి కోసం తయారు చేసిన దరఖాస్తులో ఈ వివరాలన్నింటినీ పొందుపరచక తప్పలేదు. రాజధాని కోసం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 43,472 ఎకరాల భూములుండగా 32,400 ఎకరాలను ప్రభుత్వం భూసమీకరణ ద్వారా సేకరించిన విషయం తెలిసిందే. ఈ గ్రామాల్లోనే 217.23 చ.కి.మీ. రాజధాని నగరాన్ని నిర్మించడానికి సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో మాస్టర్‌ప్లాన్ తయారు చేయించింది. సేకరించిన దాంట్లో 55.78 శాతం భూమిలో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు స్పష్టమైంది. 121.17 చ.కి.మీ పరిధిలో ఈ పంటలు సాగవుతున్నాయి. 31.19 చ.కి.మీ. వివిధ రకాల తోటలున్నాయి. వీటి శాతం 14.36 శాతం. మొత్తంగా 70.14 శాతం భూములు ఏదోరకంగా సాగులో ఉన్నవే.

ఈ భూముల్లో ఎక్కువగా పత్తి, వరి, మిరప, అరటి పంటలు సాగయ్యేవి. కృష్ణా నదికి ఆనుకుని ఉన్న ఏడు గ్రామాల్లో కూరగాయలు, పూలతోటలు సాగవుతున్నాయి. వీటితో రైతులకు బాగా ఆదాయం లభించేది. ఈ పంటలన్నింటికీ చాలావరకూ ఇప్పుడు బ్రేక్ పడింది. పంట భూముల తర్వాత  29.65 చ.కి.మీ. కృష్ణానది, కాలువలు, వాగులున్నాయి. మొత్తం భూమిలో వాటి శాతం 13.65. మిగిలిన భూముల్లో కొండలు, అర్బన్, రూరల్ ప్రాంతాలు, స్వల్పంగా ఖనిజాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement