అమ్మ కావాలంటూ గుక్క పెట్టి ఏడ్చిన చిన్నారి

బెంగళూరు: ఐదేళ్లు కూడా నిండ‌ని ఆ చిన్నారి త‌ల్లి కావాల‌ని మారాం చేసింది. అమ్మ శత్రువుతో యుద్ధం చేయ‌డానికి వెళ్లింద‌ని తెలియ‌క‌ అమ్మ కావాలంటూ గుక్క‌పెట్టి ఏడ్చింది. ఆ చిట్టిత‌ల్లి ఏడుపును ఆప‌డం ఆమె తండ్రి త‌రం కాలేదు. అలా అని అమ్మ‌ను తీసుకురానూ లేడు. దీంతో ఆ పాపాయిని తీసుకుని త‌ల్లి ప‌ని చేసే ఆసుప‌త్రికి వెళ్లాడు. అల్లంత‌దూరం నుంచే త‌ల్లిని చూసి ఏడుపు లంకించుకుందీ చిన్నారి. కానీ ఆమెను ఓదార్చేందుకు త‌ల్లి ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేక‌పోయింది. ఈ హృదయ విదార‌క ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకుంది. బెల్గం ప్రాంతానికి చెందిన సుగంధ న‌ర్సుగా ప‌నిచేస్తోంది. ప్ర‌స్తుతం కోవిడ్‌-19 పేషెంట్ల కోసం కేటాయించిన‌ ఆసుప‌త్రిలో సేవ‌లందిస్తోంది. ఆమె ఇంటికి వెళ్ల‌క ఐదురోజుల‌వుతోంది. దీంతో ఆమె నాలుగేళ్ల కూతురు త‌ల్లిపై బెంగ పెట్టుకుంది. 

అమ్మ కావాల‌ని మంకు ప‌ట్ట‌డంతో కుటుంబ స‌భ్యులు  పాపాయిని ఆసుప‌త్రి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. దూరం నుంచే బైకు మీద కూచోబెట్టుకుని త‌ల్లిని చూపించారు. ఆ పాపాయి ఏడుస్తూ.. వ‌చ్చేయ్ అమ్మా.. అంటూ క‌న్నీళ్ల‌తో అభ్య‌ర్థించింది. దీంతో ఆ త‌ల్లి గుండె త‌ల్ల‌డిల్లిపోయింది. దూరం నుంచే హాయ్ చెప్తూ తీసుకెళ్లిపోండి అంటూ కంట‌నీరు పెట్టుకుంది. ఆ చిన్నారి అమ్మను ర‌మ్మ‌ని పిలుస్తూ గింజుకోవ‌డం, గుండెల‌విసేలా రోదించ‌డం అంద‌రి మ‌న‌సుల‌ను క‌దిలించి వేస్తోంది. ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టిస్తున్న ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. కాగా ఈ విష‌యం తెలుసుకున్న‌ క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి బీఎస్‌ య‌డ్యూర‌ప్ప ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. న‌ర్సు అంకిత‌భావాన్ని ప్ర‌శంసిస్తూ, త్వ‌ర‌లోనే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతాయ‌ని హామీ ఇ్చారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top