కడప సెవెన్రోడ్స్ : తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు మెప్మా పీడీ చర్యలు చేపట్టాలని జిల్లాలో పనిచేస్తున్న ఆర్పీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చి అధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న తమను మొదట 10వ తరగతి చదివి చదవను, రాయను వస్తే చాలని తెలియజేశారన్నారు. ఆర్పీలలో కొంతమందికి మాత్రమే టెక్నాలజీ పరంగా అవగాహన ఉందన్నారు. తమకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా అధికారులు లక్ష్యాలను విధిస్తూ జూమ్ మీటింగుల పేరుతో ఒత్తిడి చేయడం తగదన్నారు. మీకు పనిచేతకాకపోతే మానుకోవాలని, కొత్తవారువస్తారని బెదిరించడం సరికాదన్నారు. తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్న ఆర్పీలకు ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా అందుకు బాధ్యులెవరన్నారు. ఒకరిద్దరు తప్పుచేస్తే దానిని మొత్తం ఆర్పీలపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్పీలకు ఐదు నెలల నుంచి వేతనం అందలేదని, పనిమాత్రం లక్ష్యాలు పెట్టి చేయించుకోవడం దారుణమన్నారు. ఆర్పీల స్థితిగతులను గుర్తించి ఏపీయూ ఒత్తిడిని తగ్గించి జియోటాగ్ లోకేషన్ తీసి వేయాలని కోరుతున్నామన్నారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు.


