మైదుకూరు : మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాయపల్లె లో పెద్ది వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి నిర్వహిస్తున్న బెల్ట్షాప్పై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో బెల్ట్ షాప్ లో అక్రమంగా విక్రయించేందుకు ఉంచిన పది క్వార్టర్ల మద్యం బాటిళ్లు, 16 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సీఐ రమణారెడ్డి ఆదేశాలతో వెంకటసుబ్బయ్య పై కేసు నమోదు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ చంద్ర నాయక్ తెలిపారు.
మహిళ బలవన్మరణం
కొండాపురం : మండల పరిధిలోని వెంకయ్యకాలువ గ్రామంలో గంజి పార్వతి(36) అనే మహిళ సోమవారం బలవన్మరణం పొందింది. ఘటనా స్థలాన్ని కొండాపురం ఎస్ఐ జయరాములు పరిశీలించారు. ఎస్ఐ వివరాల మేరకు.. వెంకయ్యకాలువ గ్రామానికి చెందిన గంజి లక్ష్మినారాయణకు పెద్దముడియం మండలం మేడిదిన్నె గ్రామానికి చెందిన గంజి పార్వతితో వివాహం జరిగింది. వేరే కాపురం, ఆస్తి పంపకాల విషయంలో తరచూ భర్తతో గొడవ పడి, తన మాట వినలేదని మనస్తాపం చెంది క్షణికావేశంలో ఉదయం 10.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతిరాలి సోదరుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం
కడప అర్బన్ : కడప నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ నెల 9వ తేదీన కె.రామసుబ్బమ్మ (80) అనే పేరుతో వృద్ధురాలిని వైద్యం కోసం చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు. ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు.


