ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ)సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి మరింత విస్తృత పరిచేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అయిన పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు. పరిశ్రమల ప్రమోషన్కు సంబందించి ఇంకా ఏవైనా అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై అవగాహన పెంపొందించాలన్నారు. పరిశ్రమలకు వివిధ రాయితీల కింద రూ.67.62 లక్షల మేర రాయితీల మంజూరు ఆమోదం తెలిపారు.
ప్రభుత్వం అనేక ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వ్యాపార, పెట్టుబడి ధోరణిలో.. పారిశ్రామిక రంగం వైపు అవగాహన నిమిత్తం ఉద్యం‘ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతోందన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించే ప్రతి ఒక్కరూ ఉద్యం పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వం నుంచి అందే అన్ని రకాల రాయితీలను పొందేలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, ఏపీఐఐసీ జెడ్ఏం శ్రీనివాసమూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ జనార్ధన, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ చిన్నా రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, డీఆర్డీఏ వీడి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు ప్రక్రియ
వేగవంతం చేయాలి
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి డిసెంబర్ మొదటి వారం నాటికి అన్ని మండలాలలో అందుబాటులోకి వచ్చేలా అధికారులు పని చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవన నిర్మాణాల పురోగతి పై జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు చేపట్టామని, ఇప్పటికే జిల్లాలో కడప నగరంలో స్మార్ట్ కిచెన్, సీకే దిన్నె స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


