అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్
● జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్08562 – 246344 ఏర్పాటు
కడప సెవెన్రోడ్స్: రాష్ట్ర వ్యాప్తంగా తుపాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులపై జిల్లా స్థాయి, క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. మండలాల వారీగా చెరువు కట్టలు, కాలువ గట్టుల పరిరక్షణపై దృష్టి పెట్టాలని, వాగులు, వంకలు, కుంటల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు మొదలు నియోజకవర్గ, మండల, సచివాలయ, గ్రామ స్థాయి వరకు ప్రతి అధికారి సిబ్బంది వారి వారి ప్రధాన కార్య స్థానాలలో అందుబాటులో ఉండాలని ఆదేశించా రు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు చేసే రైతులను అప్రమత్తం చేయాలని పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని.. ఈ మేరకు రైతులను అప్రమత్తం చేయాలని వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం అయితే.. వెంటనే దానిని పునరుద్ధరించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విపత్తు సమయంలో ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది మరింత బాధ్యతతో వారి విధులను నిర్వర్తించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, పీహెచ్ సిలలో సకాలంలో డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలని అవసరమైన మందులను అందుబాటులో ఉండాలని.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అత్యవసర సహాయ సమాచార నిమిత్తం 08562 – 246344 కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.


