ప్రత్యేక సబ్‌ డివిజన్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక సబ్‌ డివిజన్‌ డ్రైవ్‌

Jun 20 2025 5:47 AM | Updated on Jun 20 2025 5:47 AM

ప్రత్యేక సబ్‌ డివిజన్‌ డ్రైవ్‌

ప్రత్యేక సబ్‌ డివిజన్‌ డ్రైవ్‌

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో ప్రత్యేక సబ్‌ డివిజన్‌ డ్రైవ్‌ చేపట్టామని జాయింట్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌ తెలిపారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్‌ పట్టాదారులుగా నమోదైన రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటివి పొందడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆ సమస్యలను పరిష్కరించేందుకు సబ్‌ డివిజన్‌ డ్రైవ్‌ చేపట్టామన్నారు. రెవెన్యూశాఖ సబ్‌ డివిజన్‌ సేవ కోసం రూ. 500 రుసుము నిర్ణయించిందన్నారు. అయితే కేవలం నామమాత్రంగా రూ. 50 రుసుం మాత్రమే సంబంధిత గ్రామ సచివాలయాల్లో చెల్లిస్తే జాయింట్‌ పట్టాదారుల భూములను ఉచితంగా సబ్‌ డివిజన్‌ చేస్తామని తెలిపారు. ఈ ఉచిత సేవ సదవకాశం ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమేనని స్పష్టం చేశారు.

రెవెన్యూ అధికారుల మాయాజాలం

పుల్లంపేట : పుల్లంపేట మండలం, అప్పారాజుపేట గ్రామానికి చెందిన ముంతాజ్‌ బేగం తన భర్త నుండి సర్వేనెంబరు 157/1లో 54 సెంట్లు, సర్వే నెంబర్‌ 156/1లో 1.11 ఎకరాల భూమిని 1984 సంవత్సరంలో కొనుగోలు చేశారు. అయితే రెవెన్యూ అధికారులు తమ భూమిని వేరొకరిపేరుతో ఆన్‌లైన్‌ చేయడంతో సమస్యను పరిష్కరించాలని రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వీఆర్‌ఓ మల్లికార్జున మాత్రం మొక్కుబడిగా నోటీసులు పెట్టి చేతులు దులుపుకున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరితే చూస్తామంటూ కాలయాపన చేస్తున్నారని, తమ భూమిని వేరుకరి పేరుతో ఆన్‌లైన్‌ ఎలా చేస్తారని ముంతాజ్‌ బేగం ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నమాచార్య యూనివర్సిటీలో న్యాయ కళాశాల

రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీలో న్యాయవిద్యను అందించేందుకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏయూ చాన్స్‌లర్‌ చొప్పా గంగిరెడ్డి, ప్రో చాన్స్‌లర్‌ చొప్పా అభిషేక్‌రెడ్డిలు గురువారం ఇక్కడి విలేకర్లకు తెలిపారు. ఈ సందర్భంగా చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాల న్యాయవిద్య కోర్సు ప్రారంభించేందుకు బీసీఐ అనుమతి రావడం పట్ల వారు హర్షం వ్యక్తంచేశారు. 2025–2026 విద్యాసంవత్సరానికి ఒక సెక్షన్‌లో 60 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామన్నారు. ఏయూకు మరో గుర్తింపు లభించిందన్నారు. ఏయూ అభివృద్ధిలో మరో అడుగు ముందుకేసిందన్నారు. న్యాయవిద్యకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా రాజంపేట వాసులకు అందుబాటులో లా కాలేజి రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఏఐటీఎస్‌ వైస్‌చైర్మన్‌ చొప్పా ఎల్లారెడ్డి, ఏయూ వీసీ డా.సాయిబాబరెడ్డి, రిజిస్ట్రార్‌ డా.మల్లికార్జునరావు, ఏవో సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 30వ తేదీ వరకు అవకాశం

జేసీ అదితిసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement