
ప్రభుత్వ ఆదేశాల మేరకే పాఠశాలల విలీనం
చాపాడు: ప్రభుత్వ ఆదేశాల మేరకే పాఠశాలల విలీన ప్రక్రియ జరిగిందని ఈ క్రమంలో చియ్యపాడు, సిద్దారెడ్డిపల్లె గ్రామాల్లోని ఎంపీపీ స్కూల్లో గల 3, 4, 5 తరగతులను సమీపంలోని మోడల్ స్కూల్లో విలీనం చేశామని జిల్లా విద్యాధికారి షంషుద్దీన్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ నుంచి మండలంలోని చియ్యపాడు దళితవాడ, సిద్దారెడ్డిపల్లె గ్రామాల్లోని ఎంపీపీ స్కూల్ల విలీనంపై తల్లిదండ్రుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. రెండు గ్రామాల్లోని స్కూల్ల నుంచి మోడల్ స్కూల్లకు విద్యార్థులను తమ తల్లిదండ్రులు పంపించడం లేదు. ఈ క్రమంలో మంగళవారం జిల్లా విద్యాధికారి షంషుద్దీన్ ఆయా గ్రామాల్లో పర్యటించి తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ జీఓ నెంబర్–27 ప్రకారమే విలీనం జరిగిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపమని నిరసన తెలియజేస్తుండటంతో వారితో చర్చిస్తున్నామన్నారు. మోడల్ స్కూల్కు విద్యార్థులను పంపడం వల్ల ప్రతి తరగతికి అన్ని రకాల వసతులతో ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటారన్నారు. నిరసన తెలిపే గ్రామాల్లోని పాఠశాలలను కొనసాగించాలా లేక మోడల్ స్కూల్లో విద్యార్థులను విలీనం చేయాలా అనేది విద్యార్థుల చేతుల్లోనే ఉంటుందన్నారు. పాఠశాల కమిటీ, తల్లిదండ్రులతో కలసి సమావేశాన్ని నిర్వహించుకుని నివేదికను తమకు ఇస్తే దీనిని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళతామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు రవిశంకర్, వంశీకృష్ణ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దారుకు వినతి పత్రం
పాఠశాల విలీన ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలని యథావిధిగా పాఠశాలలను తమ గ్రామంలోనే కొనసాగించాలని మండలంలోని సిద్దారెడ్డిపల్లెకు చెందిన దళితవాసులు, గ్రామ పెద్దలు మంగళవారం ఎంపీడీఓ వీరకిషోర్, డిప్యూటీ తహసీల్దారు కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు.
విలీనంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను ఉన్నతాధికారులుదృష్టికి తీసుకెళ్తాం
చియ్యపాడు, సిద్దారెడ్డిపల్లెదళితవాసులతో సమావేశమైనడీఈఓ షంషుద్దీన్