
పాము కాటుతో మహిళ మృతి
సింహాద్రిపురం : మండల కేంద్రమైన సింహాద్రిపురంలో మంగళవారం పాము కాటుకు గురై మహిళ మృతి చెందింది. మృతురాలి కుమారుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సింహాద్రిపురంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ప్రమీల (57) ఇంటి వద్ద మధ్యాహ్న సమయంలో దుస్తులు ఉతుక్కుంటున్న సమయంలో పెద్ద నాగు పాము ఆమెను కాటేసింది. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు గమనించి హుటాహుటిన ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పులివెందుల తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందింది. అయితే పాము కాటు వేసిన ప్రాంతాన్ని ప్రమీల తెలపడంతో చుట్టుపక్కల వారు ఇటుకలు తొలగించి ఆ పామును చంపివేశారు.
ముంబై–చైన్నె రైలులో దోపిడీ
కడప కోటిరెడ్డిసర్కిల్ : ముంబయి నుంచి చైన్నె వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (22159) రైలులో మంగళవారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి వద్ద ఎస్1, ఎస్2 కోచ్లలో దోపిడీ జరిగింది. కడప రైల్వే సీఐ సుధాకర్రెడ్డి కథనం మేరకు.. తాడిపత్రి సమీపంలోని కోమలి వద్ద దుండగులు సిగ్నల్ వైర్లు కత్తిరించడంతో రైలు ఆగిపోయింది. బోగీల్లోకి దుండుగులు చొరబడ్డారు. రైలులో విశాలాక్షి అనే మహిళ డీఎస్సీ పరీక్ష విధుల నిమిత్తం కడపకు వస్తుండగా ఆమె మెడలో ఉన్న 2.7 గ్రాముల బంగారు చైనును దుండగులు లాక్కెళ్లారు. ఈమేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తిరిగి గుత్తికి వెళ్లి అక్కడ ఫిర్యాదు చేస్తానని రైల్వే పోలీసులకు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తాము గుత్తి పోలీసులకు కూడా సమాచారం అందించామని సీఐ వివరించారు.