
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
కాశినాయన : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని వరికుంట్ల కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల, నరసాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరికుంట్ల కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో వంటశాల, స్టోర్ రూంను ఆయన పరిశీలించారు. నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ ప్రారంభమైనప్పటి నుంచి స్టాక్ రిజిస్టర్ రాయకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ బాబుకు మెమో ఇచ్చారు. అనంతరం నరసాపురం మోడల్పాఠశాలను తనిఖీ చేసి స్కూల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు విద్యార్థులకు గుడ్డు ఇవ్వలేదని తెలుసుకుని ప్రిన్సిపాల్ సౌజన్యను ప్రశ్నించారు.
కలసపాడు : మండలంలోని పెండ్లిమర్రి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మంగళవారం ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో టిఫెన్ మెనూలో మార్పులు ఉంటాయన్నారు.