
జిల్లాలో రూ.600 కోట్ల విద్యుత్ బకాయిలు
వేంపల్లె : జిల్లాలో రూ.600 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ తెలిపారు. మంగళవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, గృహేతరాలు, వాణిజ్య సముదాయాలు తదితర వాటి నుంచి విద్యుత్ బకాయలు ఉన్నాయన్నారు. అందులో రూ.21 కోట్లు మొండి బకాయిలు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పెండింగ్లో ఉన్న విద్యుత్ బిల్లులు సుమారు రూ.700 కోట్లు వసూలు చేశామన్నారు. ప్రతినెలా లో టెన్షన్ విద్యుత్, హై టెన్షన్ విద్యుత్తు సరఫరాకు సంబంధించి దాదాపు రూ.200కోట్లు వసూలు అవుతుందన్నారు. జిల్లాలో 60 విద్యుత్ సబ్ స్టేషన్లు(33/11కేవీ) అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఒక్కొక్క సబ్ స్టేషన్కు రూ.5 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్కు దరఖాస్తు చేసుకున్న వారికి తక్షణమే కనెక్షన్ ఇచ్చేందుకు ఇబ్బందులు లేవన్నారు. ఇంధన సర్దుబాటు చార్జీలవల్ల వినియోగదారులకు అధిక బిల్లులు వస్తాయని, ఈ బిల్లులు 2026 మార్చి వరకు కొనసాగుతాయన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల ఏ విధంగా కూడా అధిక బిల్లులు రావన్నారు. ప్రస్తుతం 200 యూనిట్లు పైబడిన వారికి స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నామని, త్వరలోనే ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లను బిగించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6.75 లక్షల గృహాలకు మీటర్లు ఉన్నాయని, అంతేకాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ సోలార్ బిగించుకోవాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇదివరకే జిల్లా వ్యాప్తంగా 700 గృహాలకు సోలార్ ప్యానల్ను బిగించినట్లు తెలిపారు. రెండు నెలల్లో 10వేలు సోలార్ కనెక్షన్లు ఇవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గృహాలకు సోలార్ కనెక్షన్ బిగించుకోవడం వల్ల 90 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేంద్ర, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రవీణ్ కుమార్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
పీఎం సూర్య ఘర్ యోజనను సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీతో ఇచ్చే సోలార్ రూఫ్ టాప్కు చెందిన పీఎం సూర్య ఘర్ యోజనను గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో కేజీ సోలార్ సిస్టం ఇంటలేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు పీఎం సూర్య ఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ పవర్ నెట్ మీటరింగ్ సిస్టమ్ ద్వారా కరెంటు బిల్లును 90 శాతం తగ్గించుకోవచ్చునన్నారు. ప్రతి ఇంటి రూఫ్ టాప్ మీద 1 కిలో వాట్కు రూ.30 వేలు, 2 కిలో వాట్లకు రూ.60వేలు, 3 కిలో వాట్లకు రూ.78 వేలు,. అలాగే బీసీ కులాలకు చెందిన వారికి అదనంగా 20 శాతం అంటే రూ.98వేల చొప్పున ప్రభుత్వ రాయితీ లభిస్తుందన్నారు. గృహాలపై సోలార్ పలకలు పెట్టుకోవడం వలన విద్యుత్ బిల్లులు నెలకు రూ.400లోపే ఉంటాయన్నారు.
విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ