
ఫీజుల దోపిడీని అరికట్టాలి
కడప కార్పొరేషన్ : జిల్లాలో శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ షఫీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గురు ప్రసాద్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ రాష్ట్రంలో 87లక్షల మంది విద్యార్థులు ఉండగా కేవలం రూ.8వేల కోట్లు మాత్రమే విడుదల చేయడం దారుణమన్నారు. వారందరికీ తల్లికి వందనం ఇవ్వాలంటే రూ.13వేల కోట్లు అవసరమవుతుందని తెలిపారు. విద్యార్థులకు 4 సెమిస్టర్ల ఫీజు రీయంబర్స్మెంట్ ఇంకా విడుదల చేయలేదన్నారు. ప్రైవేటు కాలేజీలు, పాఠశాలల్లో ఫీజుల దోపిడీ ఎక్కువైందని, రకరకాల పేర్లు చెప్పి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, నగర అధ్యక్షుడు శివారెడ్డి, ఈశ్వర్రెడ్డి, సందీప్రెడ్డి పాల్గొన్నారు.